టిడిపి యువనేత నారా లోకేష్ చూస్తుండగానే ఉమ్మడి చిత్తూరు, కర్నూలు జిల్లాలలో యువగళం పాదయాత్ర పూర్తిచేసుకొని నేడు వైసీపీ కంచుకోట కడప జిల్లాలో అడుగుపెట్టబోతున్నారు. ఏప్రిల్ 12న ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రవేశించి 40 రోజులలో 14 నియోజకవర్గాలలో యువగళం పాదయాత్ర చేశారు.
ఈరోజు సాయంత్రం ఆళ్ళగడ్డ చిన్న కందుకూరు వద్ద నంద్యాల జిల్లాలో పాదయాత్ర ముగించుకొని జమ్మలమడుగు నియోజకవర్గం సుద్దపల్లి వద్ద కడప కంచుకోటలో అడుగుపెడతారు.
ఈ 108 రోజులలో నారా లోకేష్ 1,378 కిమీ పాదయాత్ర చేశారు. ప్రతీ వంద కిమీలకు ఓ శిలాఫలకం ఆవిష్కరిస్తూ దానిలో టిడిపి అధికారంలోకి వస్తే ఆ నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను నిక్షిప్తం చేయిస్తున్నారు. తద్వారా కేవలం నోటి మాటలు కాదు… మరిచిపోతే ప్రజలు తనను నిలదీసి అడగాలని నారా లోకేష్ ధైర్యంగా చెపుతున్నారు. అది ఆయన ఆత్మవిశ్వాసాన్ని, వచ్చే ఎన్నికలలో టిడిపి గెలుపు పట్ల నమ్మకాన్ని సూచిస్తోందని భావించవచ్చు.
మంగళవారం మధ్యాహ్నం భోజన విరామం తర్వాత సాయంత్రం 4 గంటలకు ఆళ్ళగడ్డ శివారులో క్యాంప్ సైట్ నుంచి మళ్ళీ పాదయాత్ర ప్రారంభించి 5.30 గంటలకు పాట బస్టాండ్ వద్ద బహిరంగసభలో ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తారు. దారిలో భూమా ఘాట్ వద్ద భూమా దంపతులకు నివాళులు అర్పిస్తారు. రాత్రి 8.00 గంటలకు సుద్దపల్లె వద్ద కడప జిల్లాలోకి ప్రవేశిస్తారు. అక్కడ స్థానికులతో సమావేశమైన తర్వాత రాత్రి అక్కడే క్యాంప్ సైట్లో బస చేస్తారు.
కడప జిల్లా వైసీపీకి కంచుకోటగా భావిస్తుంటుంది కనుక నారా లోకేష్ ఈ జిల్లాలో ప్రజలను ఏ మేరకు ఆకర్షించి ప్రభావితం చేయగలరనేది చాలా ఆసక్తికరం. వైసీపీ కంచుకోటలో ప్రవేశించి దానిని బద్దలు కొట్టే ప్రయత్నంలో శత్రువుల నుంచి ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. మాజీ సిఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షో చేస్తున్నప్పుడే లైట్లు ఆర్పేసి రాళ్ళదాడి చేసినప్పుడు తమ కంచుకోటలో అడుగుపెట్టి తమ ప్రభుత్వాన్ని అధినేతను విమర్శిస్తున్న నారా లోకేష్ని ఉపేక్షిస్తుందనుకోలేము. కనుక నారా లోకేష్ కడప గడప దాటేవరకు ఆయన రక్షణకు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.



