ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తీవ్రంగా విమర్శిస్తూ, తానూ తలచుకుంటే ప్రభుత్వాన్ని మూడు నిముషాల్లో పడగొడతనంటూ వ్యాఖ్యానించిన ముద్రగడ పద్మనాభంపై ఏపీ మంత్రి నారాయణ ఫైర్ అయ్యారు. “కాపు జాతి మొత్తం తల దించుకునేలా మాట్లాడుతున్న ముద్రగడ, జగన్ చేతిలో కీలుబొమ్మగా మారారని, ఇద్దరూ ఒకే విధంగా మాట్లాడుతున్నారని” అన్నారు.
“టైం స్టార్ట్స్… నీకు మూడు నిముషాలు ఇస్తున్నా… ప్రభుత్వాన్ని పడగొట్టు చూద్దాం…” అంటూ ముద్రగడకు సవాల్ విసిరారు నారాయణ. ప్రభుత్వాన్ని ఆబాసుపాలు చేసేందుకు ముద్రగడ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు హర్షించరని, కాపు రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, కాపులకు మంత్రి పదవులు ఇచ్చి రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యులను చేసిన ఘనత చంద్రబాబుది అని, ఉప ముఖ్యమంత్రి పదవి కూడా కాపులకే ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు నారాయణ.
తెలుగుదేశం పార్టీ వారికే కాపు రుణాలు ఇస్తున్నారని ముద్రగడ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, ఈ తరహా విమర్శలు సరికావని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఒక జాతిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సబబు కాదని అన్న నారాయణ, ముద్రగడ పద్మనాభం వ్యవహార శైలి మార్చుకోవాలని హితవు పలికారు.



