ఏపీకి ముఖ్యమంత్రి కావాలనే కోరికను జగన్ నెరవేర్చుకొన్నట్లే, ఎప్పటికైనా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైలుకి పంపాలనే కోరికను కూడా నెరవేర్చుకొన్నారు.
ఇక ఏపీలో టిడిపిని నామరూపాలు లేకుండా చేసి, మళ్ళీ అధికారంలోకి రావడం ఒక్కటే లక్ష్యంగా మిగిలి ఉంది. టిడిపి ముఖ్య నేతలందరిపై ఇక నుంచి వరుసపెట్టి కేసులు వేస్తూ అరెస్ట్ చేయించి జైలుకు పంపుతామని మంత్రి రోజా నిన్న చెప్పిన మాటలను గమనిస్తే, జగన్ ఆ లక్ష్యసాధనకు అన్నీ ఏర్పాట్లు చేసుకొన్నట్లు అర్దమవుతోంది.
జగన్ లండన్ పర్యటన ముగించుకొని మంగళవారం సాయంత్రం గన్నవరం తిరిగివచ్చారు. చంద్రబాబు నాయుడుని జైల్లో వేసిన తర్వాత టిడిపి రాష్ట్ర బంద్ తప్ప బలమైన కార్యాచరణ ఏదీ ప్రకటించలేకపోయింది. కనుక ఇకపై టిడిపి ముఖ్యనేతలపై కేసులు మరింత వేగవంతం చేయడం ఖాయంగానే భావించవచ్చు.
అయితే రాష్ట్రంలో జరుగుతున్న ఈ విపరీత పరిణామాలన్నిటినీ కేంద్ర ప్రభుత్వం కూడా నిశితంగా గమనిస్తూనే ఉంటుంది. కనుక వీలైనంత త్వరగా జగన్ ఢిల్లీకి వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలిసి తన నిర్ణయాలను సమర్ధించుకొంటూ మిగిలిన టిడిపి నేతల అరెస్టులకు వారి అనుమతి తీసుకొనే ప్రయత్నం చేయవచ్చు.
కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా చంద్రబాబు నాయుడుని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసే సాహసం చేయదు. కనుక ఇప్పుడు మిగిలిన టిడిపి ముఖ్య నేతల అరెస్టులకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వవచ్చు లేదా చంద్రబాబు నాయుడుని ఒక్కసారైనా జైలుకి పంపి ఆనందించాలనే జగన్ కోరిక తీరింది కనుక ఇక్కడితో ఈ కక్ష సాధింపు చర్యలకు ముగింపు పలకమని సూచించవచ్చు.
ఈ అంశాలపై మోడీ, అమిత్ షాలు ఏవిదంగా స్పందించబోతున్నారనే దానిని బట్టి బీజేపీ అధిష్టానం ఎటువైపు మొగ్గు చూపుతోందో అర్దం చేసుకోవచ్చు.



