నేతాజీ సుభాష్ చంద్రబోస్ మృతి అంశం మరోమారు తెరపైకి వచ్చింది. ఆయన మృతిపై ఇప్పటికే బోల్డన్ని ఊహాగానాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన విమాన ప్రమాదంలో మృతి చెందారనేది చాలా మంది వాదన. అయితే అది సరికాదని, నేతాజీ విమాన ప్రమాదంలో మృతి చెందలేదని తాజాగా విడుదలైన ఓ పుస్తకం తెలిపింది.
రిటైర్డ్ మేజర్ జనరల్ జీడీ బక్షి రాసిన బోస్-ది ఇండియన్ సమురాయ్ అనే పుస్తకంలో నేతాజీ మృతి విషయాన్ని ప్రస్తావించారు. సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మృతి చెందలేదని, సోవియట్ యూనియన్లో బ్రిటిష్ అధికారులు పెట్టిన చిత్రహింసల వల్లే ఆయన ప్రాణాలు విడిచారని బక్షి తన పుస్తకంలో పేర్కొన్నారు. జపాన్ నుంచి తప్పించుకున్న సుభాష్ చంద్రబోస్ అక్కడి నుంచి సైబీరియా చేరుకుని ఆజాద్ హింద్ ప్రభుత్వ ఎంబసీని ఏర్పాటు చేసినట్టు వివరించారు.
నేతాజీ తప్పించుకున్న విషయం తెలిసిన బ్రిటిష్ అధికారులు ఆయనను విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ సోవియట్ యూనియన్ అధికారులపై ఒత్తిడి తెచ్చారని, ఈ క్రమంలోనే నేతాజీని చిత్రహింసలకు గురిచేశారని, అధికారుల చిత్ర హింసలు భరించలేకే నేతాజీ మృతి చెందారని పుస్తకంలో పేర్కొన్నారు.



