నిర్మొహమాటంగా ఉన్నది ఉన్నట్లు చెప్పేవాళ్ళు ప్రస్తుత సమాజంలో చాలా అరుదు. అదే సినీ ఇండస్ట్రీలో అయితే టార్చ్ లైట్ వేసి వెతికినా ఒకరో, ఇద్దరో తారసపడుతుంటారు. అలాంటి వ్యక్తులలో హీరోయిన్ నిత్యామీనన్ ఒకరని తన తాజా వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. అందం, అభినయం… రెండు సమపాళ్లల్లో ఉన్న ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమాలలో చాలా తక్కువగా నటిస్తోంది. దీనికి గల కారణాన్ని తాజాగా నిత్యామీనన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చుకుంది.
తెలుగు సినిమాలన్నీ ఒకే తరహాలో సాగుతాయని… హీరో అల్లరి చిల్లరగా తిరుగుతూ హీరోయిన్ వెంట పడుతుంటాడని… అతన్ని హీరోయిన్ ప్రేమిస్తుందని… తర్వాత హీరోయిన్ ని ఇంటికి చేర్చడమో లేక విలన్ తో పగ తీర్చుకోవడమో జరుగుతుందని… అంతకు మించి తెలుగు సినిమాలలో ఏముంటాయని… అందుకే తెలుగు సినిమాలు చేయడం లేదన్న విషయాన్ని స్పష్టం చేసింది నిత్యా. అలా ఒకే తరహా సినిమాలలో నటించడం వలన ఆనందం, సంతృప్తి రెండూ ఉండవని, మూస సినిమాల్లో చేయడం తనకు ఇష్టం ఉండదని, విభిన్నతకే తన ప్రాధాన్యం అని విశదీకరించింది.
నిజానికి నిత్యా చెప్పిన మాటల్లో వాస్తవం లేకపోలేదు. దాదాపు ఒక ఏడాది క్రితం వరకు కూడా దాదాపు 80 శాతం తెలుగు సినిమా కధలు నిత్యా చెప్పిన కధ చుట్టూనే తిరుగుతున్నాయి. కానీ, ఇటీవల కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా మారుతోంది. ప్రేక్షకులు కూడా కొత్తదనాన్ని ఆదరిస్తున్నారు. అయితే ఒక ఇండస్ట్రీలో కొనసాగుతూ, అదే ఇండస్ట్రీపై హేళన వ్యాఖ్యలు చేయడమనేది… సినీ జనాలకు జీర్ణమయ్యే విషయం కాదు. అందుకే నిత్య మాటలు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అంతేకదా… సత్యాన్ని అంగీకరించడమంటే సాధారణ విషయం కాదు కదా…!



