జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడ వారాహి యాత్రలు చేసుకొన్నా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే వాటివలన మాకు ఒరిగేది తరిగేది ఏమీ లేదని మంత్రి బొత్స సత్యనారాయణ మూడు రోజుల క్రితమే చెప్పారు. అయితే ప్రస్తుతం విశాఖలో పర్యటిస్తున్న ఆయనకు అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విదిస్తూనే ఉన్నారు.
ఆయన శుక్రవారం సాయంత్రం ఋషికొండను చూసేందుకు బయలుదేరుతుంటే, ఆ రోడ్డులో వందలాదిమంది పోలీసులను మోహరించి, ఎక్కడికక్కడ బ్యారీకేడ్స్ పెట్టేశారు.
భీమిలి బీచ్ నుంచి సాగర్ నగర్, గీతం యూనివర్సిటీ, ఋషికొండ బీచ్, జోడుగుళ్ళపాలెం, తెన్నేటి పార్క్, ఆర్కె బీచ్ వరకు సముద్రతీరానికి పక్కనే సాగే ఆరోడ్డుపై నిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ముఖ్యంగా కాలేజీ విద్యార్దులు, నగరవాసులు, పర్యాటకులతో ఆ రోడ్డు కళకళలాడుతుంటుంది. అటువంటి ముఖ్యమైన మార్గాన్ని బ్యారీకేడ్లు పెట్టి మూసివేయడంతో అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు.
అయినా ఋషికొండలో ఎటువంటి అక్రమనిర్మాణాలు జరుగడం లేదని వైసీపీ ప్రభుత్వం గట్టిగా వాదిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ని అక్కడకు ఎందుకు అనుమతించడం లేదు? పవన్ కళ్యాణ్ ఏమైనా ఉగ్రవాదా లేక ఆ కొండపై ఏమైనా అమూల్యమైన సంపదలు ఉన్నాయా?ఆదేమైనా నిషేదిత ప్రాంతమా? పవన్ కళ్యాణ్ అక్కడకు వెళ్తే చాలా ప్రమాదమా?అని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు.
అసలు పవన్ కళ్యాణ్ని ఋషికొండ వద్దకు వెళ్ళకుండా అడ్డుకోవడం ద్వారానే ప్రభుత్వం అక్కడ చేయాకూడని పనులేవో చేసిందనే భావన కల్పిస్తున్నారు. ఇన్నాళ్లుగా ఋషికొండను పరదాలు కప్పి, రేకులు అడ్డం పెట్టి దాచేసినా పవన్ కళ్యాణ్ మీడియాను వెంటపెట్టుకొని అక్కడకు వెళ్ళి మాట్లాడితే అది వైరల్ అవుతుంది.
అప్పుడు వైసీపీ ప్రభుత్వం చేసిన ఘనకార్యం డప్పు కొట్టి మరీ చాటింపువేసిన్నట్లవుతుంది. విశాఖలో రాజధానికి సంబందించి ఎటువంటి నిర్మాణపనులు చేపట్టవద్దని హైకోర్టు, సుప్రీంకోర్టు చాలా స్పష్టంగానే చెప్పాయి. అయినా ఋషికొండపై పర్యాటకశాఖ భవనాలు అంటూ నిర్మాణాలు చేపట్టింది. ఈవిషయం న్యాయస్థానాల దృష్టికి వెళితే జగన్ ప్రభుత్వానికి ఇంకా ఇబ్బందవుతుంది. బహుశః అందుకే పవన్ కళ్యాణ్ని అటువైపు వెళ్ళనీయకుండా అడ్డుకొంటున్నట్లున్నారు. అయితే అరచేయి అడ్డం పెట్టి సూర్యుడిని, పరదాలు కప్పి ఋషికొండను ఎంతకాలం దాచేయగలరు?



