ఇప్పుడు ప్రతీరోజూ వైసీపి సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు లేదా అరెస్ట్ వార్తలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. తాజాగా వైసీపి అధికారంలో ఉన్నప్పుడు సకల శాఖా మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణా రెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డిపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు.
వైసీపి సోషల్ మీడియా ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న ఆయన వైసీపి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, టిడిపి నేతలు, వారి కుటుంబాలలో మహిళలపై నీచాతినీచంగా పోస్టులు పెట్టించేవారు. వైసీపి ఎన్నికలలో ఓడిపోయి అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఏమాత్రం తగ్గకుండా రెచ్చిపోతుండేవారు.
చివరికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సహనం కోల్పోయేలా చేశారు. అప్పటి నుంచే వైసీపి సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం ప్రారంభం అయ్యింది. సజ్జల భార్గవ్ రెడ్డితో పాటు వైసీపి సోషల్ మీడియాలో కీలకపాత్ర పోషించిన వర్రా రవీంద్ర రెడ్డి, అర్జున్ రెడ్డిలపై కూడా పులివెందుల పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితా వంగలపూడి ముగ్గురూ కూడా వైసీపి బాధితులు కావడం గమనిస్తే వైసీపి సోషల్ మీడియా ఎంతగా రెచ్చిపోతోందో అర్దం చేసుకోవచ్చు,
టిడిపి పార్టీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారుల నుంచి ఎంతగా ఒత్తిడి వస్తున్నప్పటికీ సిఎం చంద్రబాబు నాయుడు తొందరపడి వైసీపి నేతలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పవన్ కళ్యాణ్ కూడా తమ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేయాలనుకోవడం లేదని చాలా స్పష్టంగా చెప్పారు.
బహుశః వారి ఈ ధోరణే వైసీపికి అలుసుగా, చాతకానితనంగా అనిపించి ఉండవచ్చు. అందుకే సోషల్ మీడియాలో రెచ్చిపోయింది.
వైసీపిలో బోలెడు అనుభవం సంపాదించిన వారికి రెచ్చిపోతే పర్యవసానాలు ఏవిదంగా ఉంటాయో తెలియదనుకోలేము. కానీ జగన్ని చూసుకొని లేదా ఆయన ప్రోద్భలంతో రెచ్చిపోయి చేజేతులా ఈ సమస్యని సృష్టించుకున్నారు.
అయినా తల్లిని, చెల్లిని పార్టీ నేతల చేతే తిట్టిస్తూ సొంత మీడియాలో వారి గురించి దుష్ప్రచారం చేయిస్తున్న జగన్మోహన్ రెడ్డి, వైసీపి సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా నిలబడతానని చెపుతుండటం చాలా హాస్యస్పదంగా ఉంది.
వాలంటీర్లతో సహా అందరినీ అవసరానికి వాడుకొని వదిలేయడమే తప్ప ఎవరికీ సాయపడని, ఎవరినీ నమ్మని జగన్ తమకి సాయపడతారని అనుకుంటే అంతకంటే అమాయకత్వం, అవివేకం ఉండబోదు.
జగన్ చేతిలో సొంత మీడియా ఉంది కనుక సిఎం చంద్రబాబు నాయుడు తమపై కక్షపూరితంగా కేసులు నమోదు చేయిస్తున్నారంటూ వార్తలు, కధనాలు వ్రాయించుకోవచ్చు. కానీ అది కూడా తనని తాను ప్రమోట్ చేసుకునేందుకే అని వైసీపి నేతలు గ్రహించిన్నట్లు లేదు. కనుక జగన్ని నమ్ముకొని ఇంకా తప్పులు చేస్తే అందుకు వారే మూల్యం చెల్లించాల్సి వస్తుంది తప్ప జగన్ కాదని తెలుసుకుంటే వారికే మంచిది.




