ఓ పక్కన తమిళ మీడియాల ప్రచారం… మరో పక్కన అపోలో ఆసుపత్రి వర్గాల వివరణ… దీంతో ఏం జరుగుతుందో తెలియక సతమతమవ్వడం ప్రజల వంతవుతోంది. ఎప్పుడు ఎలాంటి సమాచారం వెలువడుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో సంచలనాల ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఓ ట్వీట్ చేసారు. సాయంత్రం 6 గంటలకు వెలువడాల్సిన ప్రకటన రాత్రి 11 గంటలకు రానుందని చేసిన ట్వీట్ సంచలనాత్మకమైంది.
ఎప్పుడూ సంచలన విషయాలనే వెల్లడించే సుబ్రహ్మణ్యస్వామి, సాయంత్రం 6 గంటలకు ఓ కీలక సమాచారం వెలువడనుందని ట్వీట్ చేయగా… సరిగ్గా అదే సమయంలో జయలలిత చనిపోయిందంటూ తమిళ మీడియా వేదికలుగా వదంతులు పుట్టుకొచ్చాయి. దీంతో అపోలో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపధ్యంలో… ప్రకటనను ఉద్దేశపూర్వకంగానే వాయిదా వేసుకున్నారా? అన్న అనుమానాలు కలుగుతోంది.
అంటే చేయాల్సిన ప్రకటన అప్పటికే ఖరారైపోయిందా? రాష్ట్ర పరిస్థితులను, ప్రజల సౌలభ్యాల దృష్ట్యా మాత్రమే ప్రకటనను వాయిదా వేస్తున్నారా? అయితే అది ఎలాంటి ప్రకటన అయ్యుంటుంది? సెప్టెంబర్ 22వ తేదీ నుండి ఉన్న ‘ముసుగు’ ఎప్పటివరకు కొనసాగుతుంది? డిశ్చార్జ్ అవుతుందనుకున్న రోజున జయలలితకు ‘కార్డియాక్ అరెస్ట్’కు గురికావడం ఏమిటి? మరి ఇలాంటి అనేక ప్రశ్నలకు 11 గంటలకు అయినా సమాధానం లభిస్తుందేమో చూడాలి. లేదా మళ్ళీ వాయిదా పడుతుందా?



