అధికారంలో ఉంటే పార్టీలకు, ఆయా పార్టీల నేతలకు రాజకీయ దేవాలయంగా కనిపించే అసెంబ్లీ (చట్ట సభలు) అధికారానికి దూరమవ్వగానే ఒక పిక్ నిక్ స్పాట్ గా, ఒక టీ స్టాల్ మాదిరిగా కనిపిస్తున్నాయి.
ఎవరికీ ఇష్టం వచ్చినప్పుడు, ఇష్టం వచ్చిన సమయం వరకు అసెంబ్లీ కి వస్తున్నారు, వెళ్తున్నారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని విపక్ష పార్టీల అధినేతలు పార్టీ అధికారానికి దూరమవ్వగానే ఇక ప్రజలతో పనేంటి.? ప్రజా సమస్యలతో సంబంధం ఏంటి అనేలా అసెంబ్లీ ని బహిష్కరిస్తున్నారు.
ఏపీలో తనకు, తన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే సాకుతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనతో పాటు తన పార్టీలోని మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీ గేటు తాకకుండా చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల కన్నా తనకు మీడియా సమావేశాలే ముద్దు అనేలా ప్రెస్ మీట్లతో సరిపెడుతున్నారు జగన్.
ఇక తెలంగాణ ప్రతిపక్ష నేతగా ప్రభుత్వం నుంచి అన్ని సౌకర్యాలు పొందుతున్న కేసీఆర్ సైతం పార్టీ ఓడిపోయిన నాటి నుంచి అసలు బయట ప్రపంచానికి ముఖం చూపించడం కూడా మానేశారు. అటువంటి కేసీఆర్ ఈ నెల 20 న మీడియా సమావేశం ఏర్పాటు చేసి రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ విధివిధానాల పై విరుచుకుపడ్డారు.
ఇక నుంచి రాజకీయాలలో యాక్టీవ్ గా ఉంటా, ఇటు పార్టీ నాయకులకు అటు పార్టీ క్యాడర్ కి అందుబాటులోకి వస్తా, రాష్ట్ర వ్యాప్తంగా సభలు – సమావేశాలు నిర్వహిస్తా, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా, ప్రజా సమస్యల మీద పోరాడతా అంటూ నానా హంగామా చేసారు కేసీఆర్.
దీనితో నేడు జరగనున్న తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ సభకు హాజరవుతారని, దీనితో తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా మారబోతున్నాయి అంటూ అటు సొంత పార్టీ నేతలు దూకుడు పెంచగా, ఇటు అధికార పార్టీ నేతలు కాచుకుని కూర్చున్నారు.
అయితే ఆ ఇద్దరి పార్టీల నేతల ఆశలు నెరవేరే సమయం వచ్చింది అన్నట్టుగా కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు. కానీ ఆర్బాటం ఆరునెలలు జీతం మూడు నెలలు అన్న చందంగా కేసీఆర్ ఇలా అసెంబ్లీకి వచ్చి ఒక సంతకం చేసి అలా అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ రాక ఎవరి కంటి తుడుపు కోసం అనేది ఇక్కడ ప్రశ్న.?
అలాగే కేసీఆర్ అసెంబ్లీలో ఉన్న ఆ కొన్ని క్షణాలలోనే ముఖ్యమంత్రి రేవంత్ కేసీఆర్ వద్దకు వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇక మరికొద్ది నిముషాలలోనే రేవంత్ – కేసీఆర్ ఆట మొదలుకాబోతుంది అనుకునే లోపే కేసీఆర్ ఎదో ఒక టీ స్టాల్ కి వచ్చి టీ తాగి వెళ్ళిపోయినట్టుగా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ రిజిస్టర్ లో ఒక సంతకం చేసి వెళ్లిపోయారు.
అయితే అసెంబ్లీ కి హజరుకు కాకపోతే తన పై స్పీకర్ అనర్హత వేటు వేసే ప్రమాదం ఉందని గ్రహించిన ఈ మాజీ ముఖ్యమంత్రి ఆ ఘండం నుంచి బయటపడేందుకే ఇలా 5 నిముషాల స్వకార్యం కోసం అసెంబ్లీ కి వచ్చి వెళ్లారు అనేది రాజకీయ విశ్లేషకుల వాదన.
గతంలో ఏపీలో వైసీపీ నేతలు కూడా అచ్చం ఇదే మాదిరి అనర్హత వేటు తప్పించుకోవడానికి, తమ ఎమ్మెల్యే పదవి కాపాడుకోవడానికి అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ రిజిస్టర్ లో ఒక సంతకం చేసి వెళ్లిపోయారు. అయితే ఇంట సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ ఇలా వైసీపీ ని ఆ పార్టీ అధినేత వైస్ జగన్ విధానాలను ఫాలో అవుతున్నారా అన్న చర్చ జరుగుతుంది.




