బిచ్చగాడికి కూడా కోపం, ఆవేశం, రోషం ఉంటాయి. కానీ వాటిని జనంపై చూపలేడు. కనుక ఏ కుక్క మీదో తన ప్రతాపం చూపుతాడు. పాక్ పరిస్థితి కూడా సరిగ్గా ఇదే! .
తమ దేశంపై ఆఫ్ఘన్ ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారంటూ పాక్ ఆరోపిస్తోంది. ఇంతకాలం భారత్-పాక్ సరిహద్దులలో ఏవిధంగా భారత్-పాక్ దళాల మద్య కాల్పులు జరుగుతుండేవో, ఇప్పుడు, పాక్-ఆఫ్గాన్ దేశాల సరిహద్దుల వద్ద నిత్యం కాల్పులు జరుగుతున్నాయి. వీటితో సహనం కోల్పోయిన పాక్ తన యుద్ధ విమానాలతో ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్పై దాడులు చేసింది.
కానీ అదొక ఆస్పత్రి భవనం. దానిలో మాదక ద్రవ్యాలకు బానిసలైనవారు చికిత్స పొందుతున్నారు. పాక్ దాడిలో 400 మంది చనిపోగా మరో 200 మంది శిధిలాల క్రింద చిక్కుకున్నారని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం తెలిపింది. ఈ దాడిని భారత్ కూడా తీవ్రంగా ఖండించింది.
అయితే పాక్ ప్రభుత్వం స్పందిస్తూ, తాము చాలా ఖచ్చితమైన సమాచారంతో కాబూల్లోని ఉగ్రవాద శిబిరాలు, సైనిక స్థావరాలపై మాత్రమే దాడి చేశామని, సామాన్య ప్రజలకు, అవారి ఆస్తులకు ఎటువంటి నష్టం కలిగించలేదని ప్రకటించింది.
నేటికీ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్ పొరుగు దేశంలో ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయడం, ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని చెప్పుకోవడం చాలా విడ్డూరంగా ఉంది. గతంలో పాక్పై భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసి, ఉగ్రవాద శిభిరాలు ధ్వంసం చేస్తే, అటువంటిదేమీ జరుగలేదని పాక్ బుకాయించింది. కానీ ఇప్పుడు ఆఫ్ఘానిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేసింది. కానీ ఉగ్రవాద శిభిరాలపై కాదు ఆస్పత్రిపై! తమకంటే బలహీనమైన ఆఫ్ఘనిస్తాన్ మీద పాక్ యుద్ధ విమానాలతో విరుచుకుపడుతోంది.
పాక్ లెక్కన భారత్ కూడా మొదటి నుంచి ఇదేవిధంగా స్పందించి ఉండి ఉంటే దాని పరిస్థితి ఏవిధంగా ఉండేదో కదా? కానీ ఇంత కాలం భారత్ ఎంత సంయమనం పాటించిందో పాక్ పాలకులకు, సైన్యానికి, ప్రజలకు ఇప్పుడు బాగానే అర్ధమయ్యి ఉంటుంది.
అంతే కాదు.. ఇంతకాలం తమ ఉగ్రవాదం వలన భారత్ ఎటువంటి బాధ అనుభవించిందో, ఎంత నష్టపోయిందో పాక్కు ఇప్పుడు బాగా అర్ధమవుతోంది.




