టీడీపీ, వైకాపా ప్రతిపాదించిన అవిశ్వాసతీర్మాణాలు చర్చకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఉదయం సభ ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడగా.. మధ్యాహ్నం 12గంటలకు తిరిగి ప్రారంభమైంది. అయితే లోక్సభలో ఎంపీలు ఆందోళన కొనసాగించారు. రిజర్వేషన్లపై తెరాస ఎంపీలు, కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే సభ్యులు నినాదాలు చేశారు.
ఆందోళన మధ్య తెదేపా, వైకాపా ఇచ్చిన అవిశ్వాస నోటీసులను స్పీకర్ సుమిత్రా మహాజన్ చదివి వినిపించారు. సభ సజావుగా సాగితేనే అవిశ్వాస తీర్మానాలపై చర్చ చేపట్టవచ్చన్నారు. సభ్యుల సంఖ్య లెక్కించడానికి అవకాశం కల్పించాలని, సంయమనం పాటించాలని స్పీకర్ కోరినా సభ్యులు ఆందోళన చేయడంతో సభను బుధవారానికి వాయిదా వేశారు.
గత కొద్ది రోజులుగా లోక్ సభలో ఇదే తంతు జరుగుతుంది. సభ్యుల ఆందోళన పేరుతో అవిశ్వాసతీర్మాణాలను స్పీకర్ పక్కన పెడుతూ వస్తున్నారు. ఇక రేపో ఎల్లుండో సభను నిరవధికంగా వాయిదా వెయ్యడం ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు అవిశ్వాసంపై అన్నిపార్టీల నేతలతో మాట్లాడి మద్ధతు కోరతానని.. ఆంధ్రప్రదేశ్కు సహకరించమని అడుగుతానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు.



