మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ త్వరలో స్పాట్ పెట్టబోతున్నారా? అంటే అవుననే చెప్పాలి.
పవన్ కళ్యాణ్ అటవీశాఖ మంత్రి కూడా. కనుక చిత్తూరు జిల్లా మంగళంపేట అటవీ భూములలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆక్రమించుకున్న 76.74 ఎకరాల భూమిని నేడు హెలికాఫ్టర్లో ఏరియల్ సర్వే చేశారు.
కానీ ఈవిషయం తెలియని వైసీపీ ఎప్పటిలాగే డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ హెలికాఫ్టర్లో దర్జాగా తిరుగుతున్నారంటూ సన్నాయి నొక్కులు మొదలుపెట్టింది. కానీ తర్వాత ఆయన దేనికి తిరుగుతున్నారో తెలిసిన తర్వాత అందరూ సైలంట్ అయిపోయారు.
ఏరియల్ సర్వే తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పేరుతో సహా అటవీ భూముల ఆక్రమణలకు సంబందించి పూర్తి వివరాలను అటవీశాఖ అధికారిక వెబ్సైట్లో పెట్టాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, న్యాయ నిపుణులతో మరోసారి ధ్రువీకరించుకున్న తర్వాత ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశించారు.
అటవీభూములు జాతీయ సంపద. వాటిని ఎవరు ఆక్రమించుకున్నా, దురుపయోగం చేసినా వారు ఎంత పెద్దవారైనప్పటికీ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు.
1959లోని ల్యాండ్ రికార్డ్స్ ప్రకారం వారికి మంగళంపేట గ్రామపరిధిలో సర్వే నం.295లో 17.69 ఎకరాలు, సర్వే నం.296లో 6 ఎకరాల పట్టా భూమి ఉండేది. ఆ తర్వాత మళ్ళీ 2000,2001 సం.లలో అవే సర్వే నం.లలో వారు ఇతరుల నుంచి మరో 45.8 ఎకరాలు కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ అయ్యింది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వే నం.295కి కొత్తగా ఏ,బీ,సీ,డీలు వచ్చి చేరాయి. వాటితో పాటు ఆ భూముల విస్తీర్ణం 75.75 ఎకరాలకు పెరిగింది. అడంగల్లో మరో 1.8 ఎకరాలు డమ్మీగా చూపారు.
అటవీ భూములకు సర్వే నం.లు సృష్టించడమే విడ్డూరం అనుకుంటే, వాటికి రిజిస్ట్రేషన్స్ కూడా జరగడం ఇంకా విచిత్రమే కదా. డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ నేడు ఏరియల్ సర్వే చేసి ఈ చిత్ర విచిత్రాలనే కళ్ళారా చూసి ఆశ్చర్యపోయారు.
పెద్దిరెడ్డి కుటుంబ కబ్జాలు ఈరోజు కొత్తగా జరిగినవి కావు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తోంది. కానీ ఇంతవరకు ఆయనపై చర్యలు తీసుకోలేకపోయింది. ఇకనైనా సాహసిస్తుందా లేదో?






