సాధారణంగా ఒక రాష్ట్ర అంతర్గత వ్యవహారాలలో మరో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలనుకోదు. అందుకే అల్లు అర్జున్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు. ఒకవేళ జోక్యం చేసుకొని ఉంటే ఇది మరో ఆంధ్రా-తెలంగాణ సమస్యగా మారే ప్రమాదం కూడా ఉంటుంది.
ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి పార్టీల నేతలు అందరూ సంయమనం పాటించారు. ఇది చాలా మంచి నిర్ణయమని రుజువు అయ్యింది కూడా.
సంయమనం పాటించడమే కాదు… ఈ అంశంపై మీడియా సమావేశంలో డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ చాలా బ్యాలన్స్డ్గా మాట్లాడి రెండు రాష్ట్రాల సంబంధాలు మరింత మెరుగుపడేలా చేశారు కూడా.
‘రేవంత్ రెడ్డి స్థానంలో నేనున్నా అదే చేస్తానంటూ’ ఆయన ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవించారు. సంధ్య థియేటర్ ఘటనపై పుష్ప-2 టీమ్ న్యాయపరమైన కోణంలో కంటే మానవతా దృక్పదంతో స్పందించి ఉంటే ఈ సమస్య ఇంత దూరం వచ్చేదే కాదన్నారు.
పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమ నుంచి రాజకీయాలలోకి వచ్చినందున ఈ వివాదంపై రెండు కోణాలలో చక్కగా విశ్లేషించారు.
అభిమానులతో కలిసి సినిమా చూస్తూ వారి స్పందన చూడాలని ప్రతీ నటీనటుడు కోరుకుంటారని, తన అన్నయ్య చిరంజీవి సైతం ఒకప్పుడు అలా చూసి ఆనందించేవారని కనుక ఈ విషయంలో అల్లు అర్జున్ని తప్పు పట్టడం సరికాదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. కానీ విజయగర్వంతో మిడిసి పడటం సరికాదని అల్లు అర్జున్కి పరోక్షంగా చురకలు వేశారు.
ఈ సందర్భంగా సినీ నటులు, సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడారు. వాటికి కొన్ని చక్కటి పరిష్కార మార్గాలు కూడా సూచించారు. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి, సినీ పరిశ్రమ అభివృద్ధికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఎప్పుడూ సహకరిస్తూనే ఉన్నాయని ఇక ముందు కూడా సహకరిస్తాయని పవన్ కళ్యాణ్ చెప్పారు.
సినీ పరిశ్రమ కూడా క్రమశిక్షణ పాటించడం అవసరమని, సమస్యల పరిష్కారానికి కొత్త ఆలోచనలు చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
ఇది అసలు రాజకీయ అంశంమే కానప్పుడు దీనిపై రాజకీయాలు చేయడం సరికాదంటూ పరోక్షంగా బిఆర్ఎస్ పార్టీకి కూడా పవన్ కళ్యాణ్ చురకలు వేశారు.
సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్ వ్యవహారం గురించి పలువురు స్పందించినప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని, సిఎం రేవంత్ రెడ్డిని కొందరి తప్పు పట్టగా, మరికొందరు అల్లు అర్జున్, సినీ పరిశ్రమ తీరుని తప్పు పట్టారు.
మంచి మసాలా ఉన్న ఈ వివాదంపై సహజంగానే తెలంగాణలో అధికార, ప్రతిపక్ష నాయకులు చాలా తీవ్రంగా స్పందిస్తూ రాజకీయ మైలేజ్ కోసం ప్రయత్నించారు. కానీ పవన్ కళ్యాణ్ పొరుగు రాష్ట్రంలో తలెత్తిన ఈ వివాదంలో ఇమిడి ఉన్న ప్రతీ సమస్యని ప్రస్తావిస్తూనే చాలా బ్యాలన్స్డ్గా, నిష్పక్షపాతంగా మాట్లాడారు.
ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల మద్య అగ్గి రాజేసిన ఈ అంశంపై పవన్ కళ్యాణ్ స్పందన రెండు రాష్ట్రాలు, ప్రభుత్వాల మద్య సంబంధాలు మరింత బలపడేలా చేయడమే విశేషం.




