పెద్దాయన ఆశయం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అన్నదమ్ముల మాదిరి కలిసి నడుస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్. అలాగే వారితో పాటుగా వారి పార్టీ లీడర్లను, క్యాడర్లను కూడా నడిపిస్తున్నారు.
ఈ రెండు పార్టీల మధ్య పొత్తు వైసీపీ ని ఎలా చిత్తూ చేయగలదో ఇప్పటికే రెండుసార్లు రుజువుకావడంతో వీరి ఈ రాజకీయ స్నేహం మరికొన్నేళ్ల పాటు ఇలానే కొనసాగాలని ఆ ముగ్గురు నేతలు ఆశపడుతున్నారు, అలాగే తమ చర్యల ద్వారా ఆచరణలో పెడుతున్నారు.
ఏడుపదుల వయస్సులో కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు ఉండాలని, హైటెక్ సిటీ, సికింద్రాబాద్ నిర్మాణం మాదిరి తన పేరు మీద ఏపీలో కూడా అటువంటి అభివృద్ధి సాధించాలని ఉవ్వుళ్లూరుతున్నారు బాబు. అయితే ఆయన ఆ ఆశయానికి మేము సైతం అంటూ కలిసి ముందుకెళ్తున్నారు పవన్, లోకేష్.
ఈ రోజులలో సొంత కుటుంబ సభ్యుల మధ్యే రాజకీయం రక్త సంబంధాలను నిట్టనిలువునా చీలుస్తుంది. అందుకు ఏపీలో వైఎస్ కుటుంబం, తెలంగాణలో కల్వకుంట్ల ఫ్యామిలీ లో రచ్చకెక్కిన వివాదాలే ప్రత్యక్ష సాక్ష్యాలు. అటువంటిది వీరి మధ్య ఎటువంటి రక్త సంబంధం లేకపోయినా ఒకటిగా కలిసి నడుస్తున్నారు, ఒక్కటిగా కనిపిస్తున్నారు.
బాబు, పవన్, లోకేష్ మధ్య బంధం రాజకీయాలను దాటి, పదవులను అధిగమనించి ముందుకు సాగుతుంది. ఈ మూడు పార్టీల బంధాన్ని నిలుపుకోవడానికి, ఈ ముగ్గురి మధ్య ఏర్పడిన అనుబంధాన్ని కొనసాగించడానికి, టీడీపీ, జనసేనను కలిపి కట్టుగా ఉంచడానికి ఒకరి కోసం ఒకరు తగ్గుతున్నారు, ఒకరి కోసం మరొకరు నిలబడుతున్నారు, అలాగే ప్రత్యర్థి పార్టీ రాజకీయ ఉచ్చులో చిక్కుకోకుండా నెగ్గుతున్నారు.
బాబు పల్లకి మోయడానికే పవన్ అంటూ జనసేనను రెచ్చకొట్టారు, కూటమి ప్రభుత్వంలో పవన్ తరువాతే లోకేష్ అంటూ టీడీపీ ని కవ్వించారు, లోకేష్ కి కూడా ఉపముఖ్యమంత్రి పదవి, ఇక పవన్ అధికారం నామమాత్రమే అంటూ కూటమిలో ఆధిపత్య పోరుకి నిప్పు రాచేశారు…ఇలా ఈ ముగ్గురు నేతల మధ్య రెండు పార్టీల మధ్య రాజకీయ చిచ్చు పెట్టడానికి వైసీపీ శతవిధాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
అయినా కూడా మేము ఒక్కటే, కూటమి ప్రభుత్వం ఉమ్మడి కుటుంబం మాదిరి మరోపదిహేనేళ్లు కలిసే ఉంటుంది, కలిసే సమస్యలను పరిష్కరించుకుంటుంది, మా స్నేహానికి రాజకీయం కొలమానం కాదు, మా బంధానికి విడాకులు ఉండవు అంటూ లోకేష్ తన పార్టీ సమావేశంలో కూటమి పార్టీల శ్రేణులకు ఒక బలమైన సందేశాన్ని అందించారు.
నిన్న రాష్ట్రంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంలో కూడా ఈ ముగ్గురి మధ్య ఉన్న అనుబంధం స్పష్టంగా కనిపించింది. మరీ ముఖ్యంగాపవన్ – లోకేష్ సొంత అన్నదమ్ముల మాదిరి వ్యవహరించారి. అది చూసిన టీడీపీ, జనసేన క్యాడర్ కి ఈ బంధానికి వైసీపీ దిష్టి తగలకూడదని, ఏ నీలి మీడియా కన్ను పడకూడని కోరుకుంటున్నారు.






