నేడు రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ వారోత్సవాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా కంకిపాడులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు డిప్యూటీ సీఎం కమ్ పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్.
గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజల సొమ్ముతో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు హాజరయిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నుంచి ఆయా పార్టీల నేతలు, మంత్రులు అందరు కూడా ప్రభుత్వ విధానాల గురించి కాకుండా ప్రతిపక్ష నాయకుల వ్యక్తిగత జీవితాల గురించి వేదికల మీద చర్చించే వారు.
దీనితో ఆ సభకు హాజరైన ప్రజలకు అసలు తాము వచ్చింది ఏ కార్యక్రానికి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం ఏమిటి అనే సందేహం ఏర్పడేది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఏర్పాటైన ఈ పల్లె పండుగ సభలో ప్రసంగించిన పవన్ అసలు సభ ఏర్పాటు ఉద్దేశాన్ని సవివరంగా ప్రజలకు వివరించారు.
అలాగే ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో మారబోతున్న పల్లెల పరిస్థితులను తెలియచెప్పారు. దీనితో పాటుగా గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితంగా ప్రజలు ఎదుర్కుంటున్న రోడ్ల దుస్థితిని, తాగు నీటి సమస్యలను అందరి దృష్టికి తీసుకు వచ్చి ఆ సమస్య పరిష్కారానికి తమ ప్రభుత్వం చేయబోయే దిద్దుబాటు చర్యలను వివరించారు.
దీనితో గత వైసీపీ ప్రభుత్వానికి ఇప్పటి కూటమి ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టంగా గమనిస్తున్నారు ఏపీ ప్రజలు. కూటమి ప్రభుత్వం ఒక బలమైన నాయకత్వంలో ముందుకు వెళ్తుందని, పోరాటానికి, పాలనకు చాల వ్యత్యాసం ఉంటుందని తనకు పాలనలో చంద్రబాబు నాయుడే ఆదర్శం అంటూ బాబు నాయకత్వం మీద తనకున్న గౌరవాన్ని మరోసారి చాటుకున్నారు పవన్.
గత ఐదేళ్లుగా ప్రభుత్వ సభలంటే ప్రతిపక్ష నాయకులను, వారి కుటుంబాలను, మీడియాను దూషించడానికి వారి మీద వ్యక్తిగత నిందలు వేయడానికే అన్నట్టుగా సాగిన నేపథ్యం నుంచి ప్రభుత్వ సభలంటే ప్రజా సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు చూపించే ఒక చుక్కానిలాంటివని చాటి చెప్పారు పవన్. దీనితో ప్రభుత్వ సభలంటే ఇలా కదా ఉండాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.






