ఈరోజు ఉదయం శాసనసభ ఆవరణలో వైసీపి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎదురుపడ్డారు. పవన్ కళ్యాణ్ ఏమాత్రం సంకోచించకుండా బొత్స సత్యనారాయణ వద్దకు వెళ్ళి కరచాలనం చేసి మర్యాదగా పలకరించి మాట్లాడారు. తర్వాత రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు.
పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి కావచ్చు… బొత్స సత్యనారాయణ కేవలం ఎమ్మెల్సీ కావచ్చు. కానీ రాజకీయాలలో, పాలనా వ్యవహారాలలో, వయసులో కూడా పవన్ కళ్యాణ్ కంటే బొత్స సత్యనారాయణ చాలా సీనియర్.
కనుక పవన్ కళ్యాణ్ ఏమాత్రం ఆలోచించకుండా వెళ్ళి పలకరించి ఆయనకి గౌరవం ఇచ్చారు. బొత్స సత్యనారాయణ కూడా పద్దతులు తెలిసిన రాజకీయ నాయకుడు కనుక ఆయన కూడా పవన్ కళ్యాణ్తో కరచాలనం చేసి మర్యాదపూర్వకంగా పలకరించి మాట్లాడారు.
ఇద్దరు ప్రజాప్రతినిధులు వేరేర్వు పార్టీలకు చెందినవారైనప్పటికీ కనీస మర్యాదలు పాటించాలని వారిరువురూ నిరూపించి చూపారు. అదే… జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుని శాసనసభలో ఎంత దారుణంగా అవమానించారో అందరూ చూశారు.
అయినా కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత శాసనసభలో జగన్ ప్రమాణస్వీకారం చేయడానికి వచ్చినప్పుడు ఆయనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయించారు. శాసనసభలో టిడిపి, జనసేన, బీజేపీ మూడు పార్టీల సభ్యులను కట్టడి చేసి అందరూ మౌనంగా ఉండేలా చేశారు.
కానీ జగన్ తడబడుతూ సభలో నుంచి పారిపోయారు. కుంటిసాకులు చెపుతూ నేటికీ శాసనసభ సమావేశాలకు హాజరుకాకుండా తప్పించుకుంటున్నారు.
ఎందువల్ల అంటే ఆనాడు తాను చంద్రబాబు నాయుడుకి శాసనసభలో చేసిన అవమానాలన్నీ గుర్తుండటం వలననే… తనకూ అవమానాలు తప్పవనే భయంతోనే అని వేరే చెప్పక్కరలేదు.
కానీ జగన్కు తెలీని కనీస మర్యాదలు, పద్దతులు బొత్స సత్యనారాయణకు బాగా తెలుసు కనుకనే మొహమాటపడకుండా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని పలకరించారు. ధైర్యంగా మండలి సమావేశాలకు హాజరవుతున్నారు కూడా.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి మంత్రి పదవి, శాసనసభ వ్యవహారాలు కొత్తే అయినప్పటికీ కనీసం మర్యాదలు, సంస్కారం ఉన్నందునే భేషజాలు పోకుండా తన కంటే సీనియర్ అయిన బొత్స సత్యనారాయణని పలకరించి రెండు చేతులు జోడించి దణ్ణం కూడా పెట్టారు. మారివన్నీ జగన్ ఇంకా ఎప్పుడు నేర్చుకుంటారో… ఎవరు నేర్పుతారో?




