“2019 ఎన్నికలలో అనంతపురం జిల్లా నుండే తానూ పోటీ చేస్తాను, మీరు గెలిపించినా, లేకుండా మీకు అండగా ఉంటాను, మీ తరపున పోరాడతాను” అంటూ బహిరంగ సభలో పవన్ చెప్పిన మాటలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. రాజకీయాలలో పోటీ అంటే కులాలను ఆధారంగా చేసుకుని, నేతల సామజిక వర్గం ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ నుండే బరిలోకి దిగుతారు. కానీ, ‘జనసేన’ అధినేత తీరు మాత్రం వేరు కదా. కుల, ప్రాంత, మతాలకతీతంగా ఉండే పవన్ అనంతపురం జిల్లా నుండి పోటీ చేయనున్నాడనే ప్రకటన ఆశ్చర్యపరిచింది.
అయితే, అనంతపురంలోనే ఎక్కడ నుండి పవన్ పోటీ అన్న ఆసక్తి అభిమానులతో పాటు సర్వత్రా నెలకొంది. దీనికి సమాధానమే ‘జనసేన’ పార్టీ నేత సుధీర్ ప్రకటించారు. ఏపీలో మొదటి ఆఫీసు అనంతపురంలోనే ఏర్పాటు చేయనున్నామని పవన్ వ్యాఖ్యలను రిపీట్ చేస్తూ… అనంతపురం జిల్లాలోని గుంతకల్ నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని సుధీర్ తెలిపారు. రాయలసీమలో నెలకొన్న కరువు కారణంగానే పవన్ ఈ జిల్లా నుండి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా జరిగిన విద్యార్ధుల భేటీలో పవన్ ఓ ఆసక్తికర సమాచారాన్ని వెల్లడించారు. ‘త్వరలోనే తానూ అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేయనున్నానని, ఈ సంకల్పం ఎప్పటినుండో ఉంది, కానీ కొన్ని కారణాల వలన అది జరగడం లేదు, అయితే కనీసం కరువు ప్రాంతాల్లో అయినా రెండు, మూడు రోజులు పర్యటిస్తానని, అప్పుడు అనంతపురంను ఎలా అభివృద్ధి చేయాలో, రాయలసీమను ఎలా పురోగతిలో నడిపించాలో చెప్తానని’ విద్యార్ధులు అడిగిన ప్రశ్నకు జవాబుగా చెప్పుకొచ్చారు పవన్.



