“ప్రజారాజ్యం” పార్టీని స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి ఆ ఎన్నికలలో రెండు ప్రాంతాల నుండి పోటీ చేసిన విషయం తెలిసిందే. సొంతూరులో ఘోర ఓటమిని చవిచూసిన మెగాస్టార్, తిరుపతిలో మాత్రం కాస్తంతలో తప్పించుకున్న విషయం విదితమే. ఇలా రెండు చోట్ల పోటీ చేసిన అన్నయ్య బాటలోనే తమ్ముడు కూడా పయనించనున్నాడన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి.
అనంతపురం జిల్లా నుండి పోటీ చేస్తానని ఇప్పటికే స్పష్టం చేసిన ‘జనసేన’ అధినేత, మరో నియోజకవర్గం నుండి కూడా పోటీ చేసే ఉద్దేశంలో ఉన్నట్లుగా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి తాజాగా వెల్లడించారు. రాజమహేంద్రవరంలో జరిగిన పార్టీ సమావేశంలో ఈ కీలక వ్యాఖ్యలు చేయడంతో… అనంతపురంలో గెలుపుపై నమ్మకం లేకనే మరో నియోజకవర్గాన్ని పవన్ పరిశీలిస్తున్నారన్న వాదనలు తెరపైకి వచ్చాయి.
ఒకవేళ గెలిచినా… రెండు చోట్ల పోటీ గెలవడం అంటే ప్రజాధనం వృధా చేయడమే అవుతుంది. ఫలితాల తర్వాత ఖచ్చితంగా ఒక నియోజకవర్గం నుండి తప్పుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఉప ఎన్నికలు, మళ్ళీ ప్రచారం… ఇదంతా ప్రజాధనం వృధానే. మరి ప్రజాధనం విషయంలో ఇతర నాయకుల కంటే తాను భిన్నం అని చెప్పిన పవన్ కూడా అదే దారిలో పయనిస్తే… ఇంకా ఇతరులకు, పవన్ కు వ్యత్యాసం ఏముంటుంది? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


