జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ్ళ తొలిసారిగా శాసనసభలో మాట్లాడారు. ఈరోజు శాసనసకు మొహం చాటేసిన జగన్, వైసీపి ఎమ్మెల్యేలను ఉద్దేశ్యించి, “వారు విజయాన్ని తీసుకున్నారు కానీ ఓటమిని ధైర్యంగా తీసుకోలేకపోయారు. అందుకే శాసనసభ సమావేశాలకు రాకుండా పారిపోయారు,” అని అన్నారు.
ఇది నూటికి నూరు శాతం నిజమే అని అందరికీ తెలుసు. ఆనాడు ఇదే శాసనసభలో ఇదే జగన్ చంద్రబాబు నాయుడుని ఉద్దేశ్యించిఓ మాట్లాడుతూ “మీకు 23 మందే ఉన్నారు కానీ మాకు 151 మంది ఉన్నారు. మేము తలుచుకుంటే మీలో ఎవరూ మీ సీట్లలో కూర్చోలేరు కూడా…” అంటూ తనలో ఫ్యాక్షనిస్ట్ గుణాన్ని బయటపెట్టుకున్నారు.
మరోసారి టిడిపి ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు వేసి బయటకు పంపించేస్తే, చంద్రబాబు నాయుడు ఒక్కరే శాసనసభలో ధైర్యంగా నిలబడి ఆ 151 మంది వైసీపి ఎమ్మెల్యేలను ఒంటరిగా ఎదుర్కున్నారు. నేటికీ ఆ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో కనబడుతూనే ఉన్నాయి.
కానీ నిన్న జగన్ శాసనసభకు వచ్చినప్పుడు ఆయన గౌరవానికి భంగం కలగనీయకుండా చంద్రబాబు నాయుడు హుందాగా వ్యవహరించారు.
ఆయన ఆదేశం మేరకు శాసనసభలో టిడిపి, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ మౌనంగా ఉండిపోయినా, నిండుసభలో తన వస్త్రాపహరణం జరిగిన్నట్లు జగన్ తడబడుతూ ప్రమాణస్వీకారం చేసి పారిపోయారు.
శాసనసభలో మనకి పని లేదని ముందే చెప్పేశారు కనుక రెండో రోజే సమావేశాలకు డుమ్మా కొట్టి పులివెందుల వెళ్ళిపోయారు.
వైసీపికి ప్రతిపక్ష పార్టీ హోదా, జగన్కు ప్రతిపక్షనేత హోదా ఇవ్వలేదని వైసీపి నేతలు, వారి మీడియా సన్నాయి నొక్కులు నొక్కుతున్నప్పుడు, శాసనసభ వ్యవహారాలలో అత్యంత ముఖ్యమైన స్పీకర్ ఎన్నిక సమయంలో సభలో ఉండాలనే ఇంగిత జ్ఞానం జగన్కు ఎందుకు లేకపోయింది?
ఆయన శాసనసభ సమావేశాలకు వెళ్ళదలచుకోలేదని చెపుతున్నప్పుడు ఇంకా ఆ ఎమ్మెల్యే పదవి దేనికి? రాజీనామా చేస్తే శాసనసభ సమావేశాలకు వెళ్ళి మాట్లాడగలిగేవారిని ప్రజలే ఎన్నుకుంటారు కదా?అని వైసీపి నేతలు, వారి మీడియా జగన్ని నిలదీసి ఉంటే బాగుండేది. కానీ వారు అడగలేరు. కనుకనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడిగారు.
విజయాన్ని ఆస్వాదించిన జగన్, ఓటమిని కూడా అంగీకరించాలి కదా?ఎన్నికలలో సింగిల్ సింహాన్ని, అర్జునుడిని అంటూ ప్రగల్భాలు పలికిన జగన్, ఇలా తోక ముడిచి శాసనసభ సమావేశాల నుంచి పారిపోతే, ప్రత్యర్ధులు, ప్రజలు నవ్వకుండా ఉంటారా?




