ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ మార్గం ఎంచుకున్నప్పటి నుంచి ఆయన తమిళనాడు వైపు ఎక్కువగా చూస్తున్నారు.
ఇటీవల ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షపార్టీ అన్నాడీఎంకే వార్షికోత్సవ దినోత్సవం రోజున మళ్ళీ ఎంజీఆర్ గురించి ప్రస్తావిస్తూ, ఆ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు.
కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ సినిమాలకు స్వస్తి చెప్పి తమిళిగ వెట్రి కజగం పార్టీతో ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశించారు. విల్లుపురంలో తన పార్టీ విధానాలు, ఆశయాలు, పొత్తుల గురించి విజయ్ ప్రకటించారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, “ఎందరో సిద్ధులు, సాధువులకు నివాసమైన తమిళనాడులో రాజకీయాలలో ప్రవేశిస్తున్న విజయ్కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు,” అని ట్వీట్ చేశారు.
సినీ పరిశ్రమ నుంచి రాజకీయాలలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడుగా పక్క రాష్ట్రంలో తనలాగే రాజకీయాలలోకి ప్రవేశిస్తున్న సాటి సినీ నటుడు విజయ్కి శుభాకాంక్షలు తెలియజేయడం పెద్ద విశేషం కాకపోవచ్చు. కానీ రాజకీయాలలో అదో ‘సిగ్నల్’గానే భావించాల్సి ఉంటుంది.
అంటే ఢిల్లీలో ఆమాద్మీ పార్టీ పక్క రాష్ట్రామైన పంజాబ్కి విస్తరించి అక్కడ ఎన్నికలలో పోటీ చేసి గెలిచి అధికారంలోకి వచ్చిన్నట్లే, పవన్ కళ్యాణ్ కూడా జనసేనని తమిళనాడులో విస్తరించాలనుకుంటున్నారా?లేదా తమిళనాడు రాజకీయాలలో నిలద్రొక్కుకోవడానికి తిప్పలు పడుతున్న బీజేపీకి పునాది వేసేందుకు సహకరించాలనుకుంటున్నారా?అనే సందేహం కలుగుతుంది.
విజయ్ తన పార్టీ ఆశయాలు, విధానాల గురించి మాట్లాడుతూ, “తమ పార్టీ పక్కా ద్రవిడ, తమిళ, లౌకికవాదాలకు కట్టుబడి పనిచేస్తుందని, మత రాజకీయాలు చేసే బీజేపీకి దూరంగా ఉంటుందని” చెప్పారు.
పవన్ కళ్యాణ్ బీజేపీతోనే ఉన్నారు. తమిళనాడులో బీజేపీ అన్నాడీఎంకె పార్టీతో ఉంది. ఆ పార్టీకి పవన్ కళ్యాణ్ మొన్ననే శుభాకాంక్షలతో ‘సిగ్నల్’ ఇచ్చారు. కనుక పవన్ కళ్యాణ్ లేదా బీజేపీ విజయ్ పార్టీతో కలవడం సాధ్యం కాకపోవచ్చు.
కనుక బీజేపీతో నిమిత్తం లేకుండా జనసేన తమిళనాడులో విజయ్ పార్టీతో చేతులు కలపబోతున్నారా?అనే సందేహం కలుగుతుంది.
ఏదిఏమైనప్పటికీ, ఈ సంకేతాలన్నీ ‘సనాతన ధర్మం’ పవన్ కళ్యాణ్ని తమిళనాడు రాజకీయాల వైపే నడిపిస్తున్నట్లు సూచిస్తున్నాయి. అది ఏవిదంగా సాగబోతోందో రాబోయే రోజుల్లో క్రమంగా స్పష్టమవుతుంది.






