ప్రతీ రంగంలో ఉన్నట్లే సినీ పరిశ్రమలో కూడా అనేక సమస్యలు, విభేధాలు ఉన్నాయి. తాజాగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ పర్సంటేజ్ సమస్య తెరచాటు నుంచి బయటకు వచ్చింది.
సినీ పరిశ్రమలో ప్రతీ ఒక్కరికీ దీని గురించి ఎంతో కొంత అవగాహన ఉంటుంది కనుక ప్రతీ ఒక్కరూ ఎవరి కోణంలో వారు మాట్లాడుతూ ఈ సమస్యని ఇంకా జటిలం చేస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్స్ అన్నీ నలుగురు సినీ ప్రముఖుల గుప్పిట్లో చిక్కుకుపోయాయని ఆరోపణలు వినిపిస్తున్న నేపధ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఇద్దరూ చేసిన వ్యాఖ్యలతో సమస్య పక్కదారి పట్టిందని ప్రముఖ నటుడు, చిన్న సినిమాల దర్శక నిర్మాత ఆర్ నారాయణమూర్తి ఆరోపించారు.
తాజాగా ప్రముఖ నిర్మాత బన్నీ వ్యాస్ ఈ సమస్యపై భిన్నంగా స్పందిస్తూ, నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ ధోరణిని తప్పు పట్టారు.
ఓటీటీలలో నెలరోజుల తర్వాత సినిమాల విడుదల చేయాలనే నిబంధన కారణంగా థియేటర్లకు ప్రేక్షకులు రావడం తగ్గితే, వారిని మళ్ళీ ఎలా రప్పించుకొని ఆదాయం పెంచుకోవాలని ఆలోచించకుండా వచ్చే అర్దరూపాయిలో వాటాల కోసం కీచులాడుకోవడం సరికాదని బన్నీ అభిప్రాయం వ్యక్తం చేశారు.
పెద్ద హీరోలు రెండు మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తుండటం వలన కూడా థియేటర్లకు ప్రేక్షకులు రావడం తగ్గిపోతున్నారని అన్నారు.
ఈ రెండు సమస్యలని పట్టించుకోకుండా ఇలాగే కొనసాగితే రాబోయే 4-56 ఏళ్ళలో 90 శాతం సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూతపడతాయని బన్నీ హెచ్చరించారు. ఒకవేళ అదే జరిగి మల్టీ ప్లెక్స్ థియేటర్స్ మాత్రమే మిగిలితే అప్పుడు సినిమా ఆదాయంలో కేవలం 43 శాతం మాత్రమే నిర్మాతలకు మిగులుతుందని బన్నీ కుండ బద్దలు కొట్టారు.
సినీ పరిశ్రమలో ఉన్నవారికి ఇటువంటి సమస్యల గురించి ఉన్న అవగాహన బయట వారికి ఉండకపోవచ్చు. కనుక ఆర్ నారాయణమూర్తి సూచించినట్లు సినీ పరిశ్రమ నుంచి రాజకీయాలలోకి వెళ్ళి ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని సినీ పరిశ్రమలో అన్ని వర్గాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలి.
ఆయన చొరవ తీసుకొని ఈ పర్సంటేజ్ సమస్యతో సహా ఇతర సమస్యలన్నిటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తే సినీ పరిశ్రమని కాపాడినవారవుతారు.
సినీ పరిశ్రమలో అనేక సమస్యలతో సతమతమవుతుంటే వాటిని పరిష్కరించకుండా ఊరుకుంటే, బన్నీ చెప్పినట్లు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూతపడక మానవు. అదే జరిగితే సినీ పరిశ్రమ కూడా మూతపడే ప్రమాదం ఉంటుంది.
కనుక ఏపీకి సినీ పరిశ్రమని రప్పించడం, రెండు తెలుగు రాష్ట్రాలలో సినీ అవార్డులు ప్రధానోత్సవం కంటే తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే చాలా చాలా ముఖ్యం.




