తెలంగాణ ఎన్నికల కోలాహలం పూర్తయ్యి అక్కడ కొత్త ప్రభుత్వం, కొత్త ముఖ్యమంత్రి ఎంపికతో ఇక తెలంగాణ రాజకీయాల వేడి తగ్గింది. పాత ప్రభుత్వానికి స్వస్తి చెప్పి మార్పు కోరుకున్న తెలంగాణ ప్రజలను చూసిన ఏపీ ప్రతిపక్ష పార్టీలలో నూతన ఉత్సహం రెట్టింపయ్యింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు అర్ధమయ్యే విధంగా వివరించగలిగితే తమ లక్ష్యం కచ్చితంగా నెరవేరుతుంది అని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ నిరూపించారు.
అదే స్ఫూర్తి తో ఏపీలో కూడా పని చేయగలిగితే వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపడం అంత కష్టమైన విషయమేమి కాదనే ఆత్మ విశ్వాసంలోకి టీడీపీ – జనసేన పార్టీల నేతలు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీల అధినేతలు కలవడంతో ఇక వైసీపీ పార్టీ పై యుద్దానికి రెండు పార్టీలు సిద్దమయినట్టే అనే అభిప్రాయానికి వచ్చారు పార్టీ క్యాడర్. నాదెండ్ల మనోహర్ తో కలిసి పవన్ హైద్రాబాద్ లోని చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు.
తెలంగాణ ఎన్నికలు ముగియడంతో ఇక ఏపీ పై ద్రుష్టి పెట్టిన ఇరుపార్టీల అధినేతలు ఏపీలో నెక్స్ట్ ఏంటి?అనే దాని పై చర్చించనున్నారు. ఉమ్మడి కార్యాచరణలు ఎలా ముందుకు తీసుకువెళ్లాలి? రెండు పార్టీల ఉమ్మడి మానిఫెస్టో ఎలా సిద్ధం చేయాలి?అనే వాటిపై చర్చ జరగనుంది. అలాగే రెండు పార్టీల పొత్తు అంశం గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది అనే నివేదికలు తెప్పించుకున్న బాబు దాని పై పవన్ తో మాట్లాడనున్నారని సమాచారం.
అలాగే ఏయే స్థానాలలో ఏయే పార్టీ పోటీలో నిలబడాలి? అందుకు అక్కడ ఉన్న స్థానిక నాయకులను ఎలా ఒప్పించాలి అనే వాటిపై కూడా చర్చ జరగనున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.అయితే ఎన్నికలకు ఇంకా కొద్దీ సమయమే ఉండడంతో ఆ విలువైన సమయాన్ని పూర్తిగా వినియోగించుకోవడానికి అవసరమైన ప్రణాళికలను ఇరు పార్టీలు ముందుగానే సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లగలిగితే చేసిన చర్చలకు, తీసుకున్న నిర్ణయాలకు ఫలితాలు కనపడుతాయి.
అలాకాకుండా ఇరు పార్టీలు సమావేశాలు, చర్చలతో కాలయాపన చేస్తే మాత్రం అంగ బలం, అర్ద బలం లో తమ కంటే బలంగా ఉన్న వైసీపీ ని ఎదుర్కోవడం కష్టమే అనే అభిప్రాయం వినపడుతుంది.




