మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ పెద్దల దృష్టిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్రెజ్ మరోమెట్టెక్కింది. అయితే ఈ ఫలితాల అనంతరం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన పవన్ మూడు రోజుల పాటు అక్కడే బస చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తో పాటుగా పలువురు కేంద్ర మంత్రులను కలిశారు.
అయితే పవన్ ఢిల్లీ టూర్ వెనుక అటు స్వామి కార్యం బీజేపీ పెద్దల ఆశీర్వాదం తో పాటుగా ఇటు స్వకార్యం అన్న నాగబాబు ను రాజ్యసభకు పంపే యోచన రెండు పూర్తి చేసినట్టు సమాచారం. ఏపీ ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా జనసేనకు దక్కిన స్థానాలను బీజేపీ కోసం పవన్ త్యాగం చేయవలసి వచ్చింది.
వాటిలో జనసేనకు కేటాయించిన అనకాపల్లి ఎంపీ టికెట్ నాగబాబు ను కాదని పవన్ బీజేపీ నేత సీఎం రమేష్ కోసం త్యాగం చేసారు. దానికి గాను భవిష్యత్ లో ఏపీ నుండి కాలికాబోతున్న రాజ్యసభ సీటుకు గాను నాగబాబు ని ఎంపిక చేస్తారు అనే ఊహాగానాలు కూడా ప్రచారమయ్యాయి.
ఇప్పుడు ఆ ప్రచారాలనే వాస్తవ రూపంలోకి తీసుకువచ్చేందుకు పవన్ బీజేపీ పెద్దల సాక్షిగా పావులు కదుపుతున్నారు అనే వార్తలు బయటకొస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వైసీపీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన సీట్లలో ఒకటి తన అన్న నాగబాబు తో భర్తీ చేయాలనీ కేంద్ర నాయకత్వానికి పవన్ సూచినట్లు తెలుస్తుంది.
అయితే వైసీపీ రాజ్యసభ సభ్యులుగా రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు ఇప్పటికే పచ్చ జెండా కప్పుకున్నారు. కాబట్టి వీరిలో ఒకరికి వారి స్థానాన్ని తిరిగి ఇచ్చే అవకాశం లేకపోలేదు, అలాగే పెద్దల సభకు వెళ్లాలనే టీడీపీ ఆశావహుల లిస్టు కూడా పెద్దగానే ఉంటుంది. దీనితో బాబు అటు పొత్తు పార్టీల డిమాండ్లతో, ఇటు సొంత పార్టీ నేతల సర్దుబాటులతో తలపట్టుకుంటున్నారు.
ఇక మేరుగ కృష్ణయ్య విషయానికి వస్తే, వైసీపీ తరుపున దక్కిన తన పదవికి రాజీనామా చేసి బీజేపీ అభ్యర్థిగా బలపడాలనే ఒప్పందంతోనే, బీజేపీ పెద్దల హామీ ప్రకారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు కూటమిలో చర్చ జరుగుతుంది. అయితే ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులలో జనసేనకు రాజ్యసభ సీటు అంటే అది చాల పెద్ద విషయమే అవుతుంది.
అందుకే పవన్ కూడా ఈ విషయమై చాల పెద్ద స్థాయి నేతలతో చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి గతంలో కూటమి కోసం జనసేన చేసిన త్యాగాలను, పవన్ తీసుకున్న నిర్ణయాలను, బీజేపీ తరుపున ఆయన చేసిన ప్రచారాలు, దాని వల్ల బీజేపీ పొందిన ఫలితాలు అన్ని గుర్తెరిగి బీజేపీ పెద్దలు పవన్ సూచనలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా.? నాగబాబు ని పెద్దల సభకు పంపుతారా.? అనేది ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే.




