జనసేనాని పవన్ కళ్యాణ్ ఇవాళ్ళ రెండు ఆసక్తికరమైన ట్వీట్స్ పోస్ట్ చేశారు.
1: “ఒక మార్పు కోసం యుద్ధం చేయాల్సివస్తే తొంబై తొమ్మిదిసార్లు శాంతియుతంగానే ప్రయత్నిస్తాను. నూరవసారే యుద్ధం చేస్తాను.”
2: (జర బద్రం పేరుతో ప్రజలకి, జనసైనికులకి ఉద్దేశ్యించి వ్రాసినది) అప్పటివరకు మనల్ని తిట్టిన నాయకులు సడన్గా మనల్ని పొగడ్డం ప్రారంభిస్తారు. ఆ పొగడ్తలను చూసి ఆ నాయకుడు మారిపోయాడు , పరివర్తన చెందాడని మనం భావించి చప్పట్లు, ఆనందకరమైన ఎమోజీలు పెడితే ప్రత్యర్ధుల లక్ష్యం నెరవేరినట్లే. అప్పటి వరకు తిట్టిన నాయకులు ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నారని ఆలోచిచాలి. పోగొడుతున్నాడు కదా అని ఆ నాయకుడిని హర్షాతిరేకాలతో ఆకాశానికి ఎత్తకండి. అది మైండ్ గేమ్లో ఒక భాగమే అని గుర్తెరగండి.”
మొదటి ట్వీట్ రాష్ట్ర రాజకీయాలలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న తనను విమర్శిస్తున్న సిఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలను ఉద్దేశ్యించి అని భావించవచ్చు. పవన్ కళ్యాణ్కు రాజకీయ అనుభవం, చాతుర్యం లేకపోవచ్చు కానీ ఓసారి ఓడిపోగానే మద్యలో కాడి వదిలేయకుండా ఇంకా రాజకీయాలలో కొనసాగుతూనే ఉన్నారు.
అయితే రాజకీయాలలో ఎంతకాలం ఉన్నామనేది ముఖ్యం కాదు. ఒకవేళ అదే ముఖ్యమనుకొంటే సిపిఐ, సిపిఎంవంటి పార్టీలు ఈపాటికి ఎన్నోసార్లు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చి ఉండేవి. కనుక రాజకీయాలలో తమ శక్తిసామర్ధ్యాలను, ప్రత్యర్ధుల బలాబలాలను అర్ధం చేసుకోవడం, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా లౌక్యంగా ముందుకు సాగడం చాలా అవసరం. ఆవిదంగా సాగిన నేతలు, పార్టీలే అధికారంలోకి వస్తుంటాయి. మిగిలిన పార్టీలు తోక పార్టీలుగానే మిగిలిపోతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక జనసేన కూడా ఈవిషయం గ్రహించడం చాలా అవసరం.
ఇక మైండ్ గేమ్స్ గురించి పవన్ కళ్యాణ్ తన పార్టీ నేతలను, ప్రజలను హెచ్చరించడం కంటే ముందుగా ఆయనే అటువంటివి గుర్తించి వాటిలో చిక్కుకోకుండా తప్పించుకోవడం నేర్చుకోవలసిన అవసరం చాలా ఉంది. వైసీపీ మైండ్ గేమ్స్లో భాగంగా దత్తపుత్రుడంటూ రెచ్చగొడుతుంటే తనకు తెలియకుండానే దానిలో చిక్కుకొని, టిడిపి, బిజెపిలకు కండిషన్స్ పెట్టి వాటితో చేతులారా విభేదాలు ఏర్పరచుకోవడం అందరూ చూశారు.
కనుక ప్రత్యర్దులు ఆడుతున్న మైండ్ గేమ్స్ను ముందుగా తానే గుర్తించి వాటిలో చిక్కుకోకుండా తాను తప్పించుకొంటూ, పార్టీని కూడా తప్పించడం పవన్ కళ్యాణ్ నేర్చుకోవాలి. ఇతర పార్టీలతో పొత్తుల గురించి బహిరంగంగా మాట్లాడేముందు పార్టీలో, మీడియాలో తన శ్రేయోభిలాషులు, రాజకీయ అనుభజ్ఞులతో లోతుగా చర్చించిన తరువాత మాట్లాడటం చాలా మంచిది. రాజకీయాలలో ఎలా సాగాలనేది ఏ పుస్తకాలలో వ్రాసి ఉండవు. అనుభవంతోనే నేర్చుకోవలసి ఉంటుంది. అందుకోసం 99 సార్లు పోరాడవలసి వచ్చినా తప్పదు.
జర బద్రం
—————
అప్పటి వరకు మనల్ని తిట్టిన నాయకులు సడెన్ గా మనల్ని పొగడ్డం ప్రారంభిస్తారు. ఆ పొగడ్తలను చూసి ఆ నాయకుడు మారిపోయాడు, పరివర్తన చెందాడని మనం భావించి చప్పట్లు, ఆనందకరమైన ఎమోజీలు పెడితే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్లే.(cont..)— Pawan Kalyan (@PawanKalyan) June 8, 2022
(Cont..)అప్పటి వరకు తిట్టిన నాయకులు ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నారని ఆలోచించాలి. పొగుడుతున్నాడు కదా అని ఆ నాయకుడిని హర్షాతిరేకాలతో ఆకాశానికి ఎత్తకండి. అది మైండ్ గేమ్ లో ఒక భాగమే అని గుర్తెరగండి.
— Pawan Kalyan (@PawanKalyan) June 8, 2022



