రాజకీయ నాయకుల ప్రసంగాల గురించి కొత్తగా చెప్పుకోనవసరం లేదు. కానీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ప్రసంగాలు మాత్రం కాగితాల మీద నుంచి కాక మనసులో నుంచి వస్తాయి. ఆయన మాటలలో నిజాయితీ, దేశభక్తి, ప్రజల పట్ల ప్రేమాభిమానాలు కనిపిస్తుంటాయి.
అందువల్లే ఆయన సభలకు జనం స్వచ్చందంగా తరలి వస్తుంటారు. చెప్పేది శ్రద్దగా వింటారు. ఆయన చెప్పేవన్నీ వారికి నచ్చకపోవచ్చు. కొన్ని అర్థం కాకపోవచ్చు. కానీ చెప్పిన వాటిలో చాలా అంశాలతో లేదా కొన్ని అంశాలతో వారు ఆయనతో కనెక్ట్ అవుతుంటారు. ఓ నాయకుడు లేదా మంచి వక్త కు ఉండవలసిన గొప్ప లక్షణం ఇదే!
నేడు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం పెరవలిలో అమరజీవి జలధార పధకానికి డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.7,910 కోట్లు వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా చుట్టుపక్కల 5 జిల్లాల్లో ఇంటింటికీ మంచి నీళ్ళు అందుతాయి. సుమారు 1.20 కోట్ల మందికి లబ్ది కలుగుతుంది. ఈ సందర్భంగా అక్కడ జరిగిన సభలో డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ దాదాపు 45 నిమిషాల సేపు ప్రసంగించారు. ఆయన మాట్లాడుతున్నంత సేపు ప్రజలు, అభిమానులు హర్షద్వానాలు చేస్తూనే ఉన్నారు. ఆయన ప్రసంగంలో 5 ప్రధాన అంశాలున్నాయి. వాటిలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి మూడు ముఖ్యమైన అంశాల గురించి మొదట చెప్పుకుందాం.
1. పర్యావరణ పరిరక్షణ.
2. ఇటువంటి పథకాల విషయంలో వాస్తవంగా ఏం జరుగుతోంది? ఎందువల్ల విఫలం అవుతున్నాయి? కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి ఎందుకు సంకోచిస్తోంది?
3. అభివృద్ధి పనుల విషయంలో తన పద్ధతి గురించి ఇచ్చిన వివరణ.
‘పర్యావరణ పరిరక్షణ’ ఎవరికీ ఆసక్తి లేని అంశమని చెప్పక తప్పదు. కానీ దాని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు ప్రతీ ఒక్కరూ ఆసక్తిగా విన్నారు. ఎందుకంటే వారు సులువుగా అర్థం చేసుకునే విధంగా చెప్పారు కనుక. “ఒకప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఏమాత్రం సంకోచం లేకుండా అందరం నీళ్ళు త్రాగేవాళ్ళం. ఈ విషయం మీ పెద్దవాళ్ళని అడిగితే చెపుతారు.
కానీ ఆక్వా కాలుష్యం వలన భూగర్భ జలాలన్నీ కలుషితమైపోయాయి. కనుక పక్కనే కృష్ణా, గోదావరి నదులు ప్రవహిస్తున్నా మినరల్ వాటర్ బాటిల్స్ కొనుకొని తాగాల్సివస్తోంది. ఒకవేళ ఈ నీళ్ళ కాలుష్యం లేకుంటే మీ అందరికీ మంచి నీళ్ళు అందించేందుకు ఈ ప్రాజెక్ట్ కట్టాల్సిన అవసరం ఉండేదే కాదు. దీని కోసం ఖర్చు రూ.7,910 కోట్లు వేరే అభివృద్ధి పనులకు వినియోగించగలిగి ఉండేవాళ్ళం కదా?
కానీ సహజ వనరులను కాలుషితం చేసుకొని మంచినీళ్ళ కోసం ఇంత డబ్బు ఖర్చు పెట్టాల్సివస్తోంది. ఇది నాకు చాలా బాధ కలిగిస్తోంది. అందుకే పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత కూడా,” అని పవన్ కళ్యాణ్ చెప్పారు.
“కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల కోసం ఇలాంటి అనేక పధకాలు అమలు చేస్తోంది. కానీ ఒక్క ‘జలజీవన్ మిషన్’ కార్యక్రమంలో అందరూ కలిసి వేలకోట్లు మింగేశారు. పైప్ లైన్లు వేశారు దేనిలో ఒక్క చుక్క నీళ్ళు రావు. నిధులు ఇంతగా దుర్వినియోగం అవుతున్నప్పుడు ఇలాంటి పథకాలకు నిధులు ఎందుకు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిలదీస్తోంది.
ఈసారి నాదే బాధ్యత.. ఈ ప్రాజెక్ట్ సకాలంలో సక్రమంగా పూర్తిచేస్తానని పదేపదే హామీ ఇచ్చాకనే ఈ నిధులు మంజూరు అయ్యాయి.
ఈ ప్రాజెక్టు పనులలో నేను జోక్యం చేసుకోను. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాను. ఈ పనులు పొందిన కాంట్రాక్టర్లు ఎవరో కూడా నాకు తెలీదు. వారు ఎవరైనప్పటికీ ఎవరికీ ఒక్క పైసా లంచం, కమీషన్ ఈయాల్సిన అవసరం లేదు. కనుక ప్రజలు హర్షించేలా పనులు సకాలంలో సక్రమంగా జరగాలి. ఒకవేళ జరగకపోతే అధికారులు, కాంట్రాక్టర్లపై కటిన చర్యలు ఉంటాయి,” అని డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ సభాముఖం స్పష్టం చేశారు.






