తెనాలిలో రౌడీ షీటర్స్ జగన్ దృష్టిలో పిల్లలు.. ఇంకా చెప్పాలంటే దళితులు. కనుక వారు ఎన్ని తప్పులు చేసినఅ చూసీ చూడనట్లు వదిలేయాలి.
రెంటపాళ్ళలో వైసీపీ కార్యకర్తలు ‘గంగమ్మ జాతరలో వేటలు నరికినట్లు రప్ప రప్పా తలలు నరికేస్తాం కొడకల్లారా’ అని ఫ్లెక్సీ బ్యానర్లు ప్రదర్శిస్తే “పిల్లలు సరదాగా సినిమా డైలాగులు చెప్పినా తప్పేనా?” అంటూ జగన్ వెనకేసుకువచ్చారు.
కేసీఆర్ ప్రభుత్వం తన చెల్లెలు వైఎస్ షర్మిల ఫోన్ ట్యాపింగ్ చేయిస్తే, “ఆమె తెలంగాణలో పార్టీ పెట్టుకుంది కనుక ఫోన్ ట్యాపింగ్ చేయించి ఉండొచ్చు.. దాంతో నాకేం సంబంధం?” అని ప్రశ్నించారు జగన్.
జగన్ స్వయంగా 16 నెలలు జైల్లో ఉండి వచ్చారు కనుక నేరస్థుల పట్ల ఆయనకు సానుభూతి ఏర్పడి ఉంటుంది. కానీ నేరస్థులను పోగేసుకొని వారిని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తూ, పైచేయి సాధించాలనుకోవడమే చాలా తప్పు.
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చివరికి సొంత తల్లి, చెల్లిపై కూడా స్వయంగా, వైసీపీ నేతల చేత, సొంత మీడియాలో చాలా దారుణంగా విమర్శలు చేయిస్తున్న జగన్, హుందాగా రాజకీయాలు చేస్తారని ఆశించడం అవివేకం. అత్యాశే అవుతుంది.
అందుకే “రప్ప రప్పా తలలు నరికేస్తాం కొడకల్లారా” అంటూ బెదిరిస్తున్న వైసీపీ కార్యకర్తలను వారించకపోగా వెనకేసుకు వచ్చారనుకోవచ్చు. కనుక టీడీపీ నేతలని, పోలీస్ ఉన్నతాధికారులను ఈవిదంగా బెదిరించి భయపెడుతూ పైచేయి సాధించాలని జగన్ భావిస్తున్నట్లు అనుమానం కలుగుతోంది.
అయితే సినిమాలో డైలాగులు థియేటర్ల వరకే బాగుంటాయి కానీ బయట ప్రయోగించి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తామంటే ఉపేక్షించే ప్రసక్తే లేదని డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ అన్నారు.
రాష్ట్రంలో ఎవరైనా చట్టానికి లోబడి వ్యవహరించాలి తప్ప ఇష్టారాజ్యం చేస్తామంటే కుదరదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
ఎవరైనా విచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. రాజకీయ పార్టీలు ప్రజలకు ఆదర్శప్రాయంగా ఉండాలి తప్ప ప్రజలలో చిచ్చు పెట్టి శాంతి భద్రతల సమస్య సృష్టించకూడదని పవన్ కళ్యాణ్ అన్నారు.
అయితే ఇదివరకు “నేనే హోం మంత్రినైతే పరిస్థితి ఇలా ఉండదు,” అంటూ రాష్ట్ర హోంమంత్రి అనిత వంగలపూడిపై అసహనం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్, రెంటపాళ్ళలో వైసీపీ చేసిన హడావుడి చూసిన తర్వాత ఇప్పుడు ఇంత ఆలస్యంగా స్పందిస్తుండటం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. బహుశః తన సినిమా షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల వెంటనే స్పందించలేకపోయి ఉండొచ్చు.
పవన్ కళ్యాణ్ రెండు రోజుల తర్వాత అయినా స్పందించారు. కానీ కూటమి ప్రభుత్వంలో బీజేపి కూడా భాగస్వామిగా ఉన్నప్పటికీ ఏ ఒక్కరూ రెంటపాళ్ళలో వైసీపీ అత్యుత్సాహాన్ని, జగన్ మాటలని ఖండించక పోవడాన్ని ఏమనుకోవాలి?




