పెద్ది సినిమాకి నైజాంలో ఇంకా అనిశ్చితి పరిస్థితి కొనసాగుతూనే ఉంది. మొదట్లో సింగిల్ థియేటర్ ఓనర్లు, తర్వాత ఎగ్జిబిటర్లు సినిమా రిలీజ్ కి అడ్డంకిగా నిలిచారు. అవన్నీ సర్దుమణిగి, సినిమా మరో 5 రోజుల్లో విడుదలవుతుంది అనగా.. పెద్దికి మరో పెద్ద సమస్య తలెత్తింది.
విషయం ఏంటంటే.. జూన్ 4న రామ్ చరణ్ పెద్ది రిలీజ్ కి టికెట్ హైక్ కోసం తెలంగాణలో సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రీ సంస్థ హైదరాబాద్ లోని హై కోర్ట్ లో పిటిషన్ వేసింది. వారం రోజుల పాటు టికెట్ హైక్ కి పర్మిషన్ తోపాటుగా, ప్రీమియర్స్ కి పర్మిషన్ కోసం ధరకాస్తు చేసుకోగా.. కోర్టు దాన్ని పట్టించుకోలేదు. ఆర్డర్ పాస్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు. అందుకు కారణం హైక్ కోసం 90 రోజుల ముందే అర్జీ చేసుకోవాలని ఇదివరకు కోర్టు పాస్ చేసిన ఆర్డర్స్. ఇప్పుడు పెద్దికి హైక్ ఇస్తే తమ ఆర్డర్స్ ని తామే తుంగలో తొక్కినట్లు అవుతుందని కోర్టు భావించింది.
దాంతో హోమ్ సెక్రటరీకి కూడా రెండుసార్లు వినతి పత్రం సమర్పించారు. అక్కడి నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. దాంతో మైత్రీ సంస్థ పిటిషన్ ను వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. గతంలోనూ మైత్రీ సంస్థ తెలంగాణలో డిస్ట్రిబ్యూట్ చేసిన “రాజాసాబ్” విషయంలో టికెట్ హైక్ కారణంగా లాస్ట్ మినిట్ వరకు రిలీజ్ అవుతుందో లేదో క్లారిటీ లేక, ప్రీమియర్స్ క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు పెద్ది విషయంలో ఆ పరిస్థితి ఎదురవ్వకూడదంటే.. టికెట్ హైక్ తో సంబంధం లేకుండా ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్లతోనే సినిమాని రిలీజ్ చేయాలి.
లేకపోతే.. చిరంజీవి మరోసారి ఇన్వాల్వ్ అయ్యి, రేవంత్ రెడ్డితో తనకున్న సాన్నిహిత్యాన్ని మళ్లీ పణంగా పెట్టి స్పెషల్ పర్మిషన్ తెప్పించుకోవాలి. మరి చిరంజీవి అందుకు ఒప్పుకొని ముందుకు వస్తారా? లేదా? అనేది చూడాలి. అయినా.. ప్రతిసారి మైత్రీ సంస్థ నుండి వస్తున్న సినిమాకి ఇలాంటి కోర్ట్ ఇష్యూస్ రావడం అనేది వారి డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థకి భవిష్యత్తులో పెద్ద అడ్డంకిగా మారుతుంది.




