వచ్చే ఎన్నికలలో టిడిపి, జనసేనలను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ను దెబ్బ తీసేందుకు రాంగోపాల్ వర్మ చేస్తా వైసీపీ ఓ సినిమా తీయించబోతోంది. ఆ విషయం రాంగోపాల్ వర్మ స్వయంగా చెప్పడమే కాకుండా, రెండు భాగాలలో తీయబోతున్న ఆ సినిమా టైటిల్స్ వ్యూహం, శపధం అని నిన్ననే ప్రకటించేశాడు. ఆ సినిమా రాజకీయ కుట్రలు, కుతంత్రాలతో నిండి ఉంటుందని తెలిపారు.
ఈరోజు మరో ట్వీట్లో తన కధాంశం ఏమిటో మరింత స్పష్టత ఇచ్చాడు. “బిజెపి÷ పవన్ కళ్యాణ్ x చంద్రబాబు నాయుడు- నారా లోకేష్+ జగన్మోహన్ రెడ్డి = వ్యూహం” అని ట్వీట్ చేశారు.
అయితే రాంగోపాల్ వర్మ ప్రకటనపై మాజీ బిజెపి ఎమ్మెల్యే, రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షుడు పెన్మత్స విష్ణుకుమార్ రాజు స్పందిస్తూ, “సినిమా ఇండస్ట్రీలో ఎవరూ పట్టించుకోని వ్యక్తి రాంగోపాల్ రాంగోపాల్ వర్మ. ఆయనకు ప్రచార యావ చాలా ఎక్కువ. అటువంటి వ్యక్తితో సినిమా తీయించుకోవాలనుకోవడం అంటే పిచ్చోడి చేతికి రాయిచ్చి కొట్టించుకొన్నట్లే. అయినా జనసేనను, పవన్ కళ్యాణ్ని ఇలాంటి పిచ్చి సినిమాలతో దెబ్బతీయవచ్చని అనుకోవడం అవివేకం. జనసేనను చూసి సిఎం జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు గాబట్టే ఇటువంటి ఆలోచనలు చేస్తున్నారు. రాంగోపాల్ వర్మ ఈ సినిమాకు వ్యూహం అని పేరుపెట్టినట్లు ప్రకటించారు. కానీ దానికి ‘కుట్ర’ అనే పేరు సరిపోతుంది,” అని అన్నారు.
ఇటీవల తమ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ ధియోధర్, టిడిపి, బిజెపిల పొత్తులు ఉండబోవని చెప్పడంపై విష్ణుకుమార్ రాజు స్పందిస్తూ, “రాష్ట్రంలో వైసీపీ పాలన పట్ల ప్రజలలో చాలా విముఖత ఉంది. దానిని ఎదుర్కోవాలంటే బిజెపి, జనసేనలు మళ్ళీ టిడిపితో కలిసి పోటీ చేయడం మంచిదని నేను భావిస్తున్నాను. ప్రజలందరూ కూడా మూడు పార్టీలు మళ్ళీ కలవాలని కోరుకొంటున్నారు. కనుక ప్రజలు ఏమనుకొంటున్నారో సునీల్ ధియోరర్ విన్నాక మాట్లాడి ఉంటే బాగుండేదని భావిస్తున్నాను. రాష్ట్రం కోసం అవసరమైతే మన సొంత అజెండాను పక్కన పెట్టుకోవాలి. ఏది ఏమైనప్పటికీ, పొత్తుల విషయం మాపార్టీ అధిష్టానమే నిర్ణయిస్తుంది,” అని విష్ణుకుమార్ రాజు అన్నారు.



