పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచడం మరిచిపోయారా ఏంటి?

Petrol pump displaying increased fuel prices amid global oil crisis and US Iran war impact

అమెరికా-ఇరాన్‌ యుద్ధం, చమురు, గ్యాస్ సంక్షోభం పేరుతో చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచేశాయి. ఇంకా యుద్ధం కొనసాగుతోంది. కనుక తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల పెంచడం ఖాయమేనని ప్రజలు భావిస్తున్నారు.

చమురు కంపెనీలు దేశ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ప్రజలను మానసికంగా సిద్ధం చేయడానికి ముందుగా గురువారం అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా ప్రీమియం పెట్రోల్ ఛార్జీలు లీటరుకి రూ.2.65 చొప్పున పెంచాయి! కనుక ఇక పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడమే ఆలస్యం!

ADVERTISEMENT

దానికీ ముహూర్తం సిద్ధంగానే ఉంది. ఎప్పుడంటే ఏప్రిల్‌ 29 అర్దరాత్రి నుంచి! ఆరోజే దేనికంటే ఏప్రిల్‌ 29న నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభ పోలింగ్ ఆ రోజు సాయంత్రం ముగుస్తుంది కనుక!

నిజానికి ఎన్నికలకు ముందు గ్యాస్ సిలిండర్ ధర పెంచడం చాలా సాహసోపేతమైన నిర్ణయమని చెప్పక తప్పదు. కానీ గ్యాస్ కొరత చాలా తీవ్రంగా ఉంది కనుక తక్షణం గ్యాస్ ధర పెంచుకోవడానికి చమురు కంపెనీలను కేంద్ర ప్రభుత్వం అనుమతించక తప్పలేదు.

కానీ పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెంచేస్తే, సరుకు రవాణా ఛార్జీలు పెరుగుతాయి. వాటితో నిత్యావసర సరుకులు, కూరగాయలు వగైరా ధరలు పెరిగిపోతాయి.

ఈసారి ఎలాగైనా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గెలిచి అధికారంలోకి రావాలని బిజేపి అధిష్టానం చాలా పట్టుదలగా ఉంది. అలాగే తమిళనాడులో కూడా విజయ్‌తో పొత్తు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. పొత్తు కుదిరితే తమిళనాడు కూడా అన్నాడీఎంకే-బిజేపి-టీవికే కూటమి గెలిచి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది.

కనుక ఇలాంటి సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం అంటే కూర్చొన్న కొమ్మను నరుక్కోవడమే అవుతుంది. కానీ ఈ రెండు రాష్ట్రాలలో బిజేపి గెలిచినా గెలవకపోయినా ఏప్రిల్‌ 29 అర్దరాత్రి నుంచి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేయడం ఖాయమే…. అప్పటికీ యుద్ధం కొనసాగుతుంటే!

ADVERTISEMENT
Latest Stories