ఈ నెల 11న జరుగబోయే మున్సిపల్ ఎన్నికల కోసమే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసుతో తమని వేధిస్తోందని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
వారి వాదనల ప్రకారం అధికార పార్టీలు కేసులని తమ రాజకీయ ప్రయోజనం కోసం వాడుకుంటున్నట్లు అర్ధమవుతోంది. అధికారంలో ఉన్నవారికి ఈ అడ్వాంటేజ్ ఎప్పుడూ ఉంటుంది. కనుక ఈ కేసుల అస్త్రాలను అప్పుడప్పుడు ఇలా సందిస్తూనే ఉంటాయి. కానీ ప్రతీసారి వాటితో అవి ఆశించిన రాజకీయ లబ్ది, మైలేజ్ పొందగలవా?అంటే అనుమానమే.
ఉదాహరణకు ఏపీలో మద్యం కుంభకోణం కేసు, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులతో అధికార పార్టీలు సాధించింది ఏమిటి?అంటే ఏమీ కనపడదు. కనీసం ఆ కేసులలో పురోగతి కూడా ఉండదు.
కనుక వాటిని అస్త్రాలుగా ఉపయోగించుకుంటూ తమ ప్రభుత్వాలపై బురద జల్లుతున్న ప్రతిపక్షాలని కొంత వరకు కట్టడి చేయగలవు అంతే! అది కూడా వారు బెయిల్పై బయటకు వచ్చే వరకే. ఆ తర్వాత మళ్ళీ బురద జల్లుడు మామూలే!
ఈ కేసులతో అధికార పార్టీలు ఆశించిన ప్రయోజనం పొందలేకపోతున్నా, వాటిని ఎదుర్కొంటున్న ప్రతిపక్షాలు మాత్రం వాటి నుంచి పూర్తి మైలేజ్ పొందుతుండటం విశేషం. అంటే బాధితులే ఎక్కువ లబ్ది పొందుతున్నారన్న మాట!
ఉదాహరణకు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ నేడు నంది నగర్ నివాసంలో మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరయ్యారు.
ఆయనకు సిట్ నోటీస్ ఇచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వందల కొద్దీ పోస్టులు పెడుతూ ఖండిస్తున్నారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్కి నోటీస్ ఇవ్వడం అంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయడమే అని వాదిస్తున్నారు.
ఆయనకు సిట్ నోటీస్ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు లభిస్తున్న మీడియా కవరేజ్ అంతా పూర్తిగా ఉచితమే. మున్సిపల్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి సానుభూతి ఓట్లు రాల్చేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని వేరే చెప్పక్కరలేదు.
రెండేళ్లుగా ఫామ్హౌసులో ఉండిపోయి క్రమంగా తన గుర్తింపుని కోల్పోతున్న కేసీఆర్, ఈ కేసులో ఆయన నిందితుడుగానో లేదా సాక్షిగానో విచారణకు హాజరవుతున్నట్లు కాక యుద్దానికి బయలుదేరుతున్న వీరాధివీరుడుగా బీఆర్ఎస్ పార్టీ చాలా చక్కగా ప్రాజెక్ట్ చేసకుంటోంది. అక్కడి నుంచి కేసీఆర్ కారులో బయలుదేరినప్పుడు గుమ్మడికాయతో దిష్టి తీయడం మొదలు దారి పొడవునా గులాబీ శ్రేణులు పూలు జల్లుతూ స్వాగతం పలకడం వంటి ఏర్పాట్లు కేసీఆర్ని హీరోగా ప్రమోట్ చేసేవే.
చాలా తీవ్రమైన నేరంగా పరిగణించబడే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ చిక్కుకునందుకు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన చెందాల్సి ఉండగా, ఈవిధంగా హీరోగా ప్రమోషన్ చేసుకోగలుగుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీదా లేక బీఆర్ఎస్ పార్టీదా? ఏపీ మద్యం కుంభకోణం కేసులో కూడా ఇలాగే జరుగుతోంది కదా? అంటే ఈ రెండు కేసులలో పైచేయి ఎవరిది? అధికారంలో ఉన్నవారిదా బాధితులుగా చెప్పుకుంటున్న ప్రతిపక్షాలదా?






