“నాయకులు కాదు.. కార్యకర్తలు, పార్టీ ప్రయోజనాలే ముఖ్యం,” సిఎం చంద్రబాబు నాయుడు నోట తరచూ ఈ మాట వినపడుతూనే ఉంటుంది. కానీ పార్టీలో చాలా మంది ఈ మాటని చెవికెక్కించుకోక నష్టపోతుంటారు.
తాజాగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా ఆవిధంగానే నష్టపోయారు.
నియోజకవర్గంలో తరచూ రెండు పార్టీల మద్య ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతుండటంతో సిఎం చంద్రబాబు నాయుడు ఆయనని ఆ పదవి నుంచి తప్పించారు. నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలను చక్కదిద్దేందుకు ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ప్రకటన వెలువడిన తర్వాత వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, “మొన్న మంత్రి నారా లోకేష్తో అన్ని విషయాలు మాట్లాడాను. పరిస్థితి వివరించాను. అప్పుడే ఆయన నాకు ఈ విషయం తెలియజేశారు. ఈరోజు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి నారాయణ కూడా నాకు ఫోన్ చేసి సిఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం గురించి మరోసారి తెలిపారు.
పార్టీ ప్రయోజనాలే నాకు ముఖ్యం. అందుకోసం అవసరమైతే కొన్ని త్యాగాలు తప్పవు. ఇలాంటి మార్పులు చేర్పులు కూడా అవసరమే. కనుక వీలైనంత త్వరగా కమిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.
వర్మ స్పందన చాలా హుందాగా ఉంది. అయన మాటల్లో టీడీపి క్రమశిక్షణ కనిపించింది. కానీ తనకు అన్యాయం జరిగిందనే బాధ అయన మాటల్లో వినిపిస్తోంది. దానిని తప్పు పట్టడడం అనవసరం.
ఎందుకంటే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కేటాయించినప్పుడు తొలుత ఆయన బాధ పడ్డారు. కానీ పార్టీ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని తన సీటుని పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసి అయన తరపున ఎన్నికల ప్రచారం కూడా చేశారు. పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిచేందుకు చాలా తోడ్పడ్డారు.
ఆ కృతజ్ఞతతోనే పవన్ కళ్యాణ్ “నేను ఎమ్మెల్యే అయినప్పటికీ పిఠాపురానికి వర్మే నిజమైన ప్రతినిధి. వర్మతో చెపితే నాతో చెప్పినట్లే. వర్మ చెపితే నేను చెప్పినట్లే,” అని సముచిత గౌరవం ఇచ్చారు.
కానీ ఆ తర్వాత పిఠాపురంలో జనసేన, వర్మ అనుచరులకు మద్య పలు సందర్భాలలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. తన సీటు త్యాగం చేసి బలపరచడం వల్లనే పవన్ కళ్యాణ్ అంత భారీ మెజార్టీతో గెలిచారని వర్మ అనుకోవడం ఎంత సహజమో, “మేమే రేయింబవళ్ళు కష్టపడి మా నాయకుడుని గెలిపించుకున్నాము. మేము డెప్యూటీ సిఎం తాలూకా” అని స్థానిక జనసేన నేతలు, కార్యకర్తలు అనుకోవడం కూడా అంతే సహజం.
ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవని తెలిసి ఉన్నప్పుడు ఇరు వర్గాలు ఎవరి హద్దులలో వారుండాలి. ఒకరు అతి చేసినా రెండో వారు చేయక తప్పదు. ఒంటి చేత్తో చప్పట్లు సాధ్యం కాదు. పిఠాపురంలో రెండు చేతులు కలిసాయి కనుకనే సౌండ్ పెరిగింది.
కనుక ఇకనైనా పిఠాపురంలో పరిస్థితి చక్కబడితే అందరికీ మంచిది లేకుంటే ఈ అగ్గిని కార్చిచ్చుగా మార్చేందుకు వైసీపీ ఉండనే ఉంది.




