ప్రజలు చైతన్యవంతం అవ్వాలని రాజకీయ నాయకులు చెబుతుంటారు. వారి ఉద్దేశ్యం మా రాజకీయాలకు, మా ఆలోచనలకు, మా విధానాలకు అనుగుణంగా మీరు ట్యూన్ అవ్వాలని! తమ రాజకీయ ప్రత్యర్థులను మీ ప్రత్యర్థులుగా భావించమని అర్థం.
మేమూ, మా పార్టీ, మా ప్రభుత్వం, ఇంకా చెప్పాలంటే మా కుటుంబం మాత్రమే మంచిది. మేము మాత్రమే మీకు, రాష్ట్రానికి మేలు చేయగలం… చేస్తామని నమ్మించడమే. ప్రజలను తమకనుకూలంగా ట్యూన్ చేసుకోవడాన్నే వారు ‘ప్రజలలో రాజకీయ చైతన్యం’ కలిగించడంగా భావిస్తుంటారు.
చాలా అరుదుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వంటి నాయకులు రాష్ట్రాభివృద్ధి, విద్య, ఉద్యోగాల కల్పన వంటివాటి గురించి ప్రజలను ఆలోచింపజేస్తుంటారు. రాజకీయ చైతన్యం కలిగించడమంటే ప్రజలను అభివృద్ధిపదం వైపు నడిపించడమేనని వారు భావిస్తుంటారు.
కానీ ముందే చెప్పుకున్నట్లు ఒక్కో రాష్ట్రంలో, ఒక్కో పార్టీ ఒక్కో అంశాన్ని తీసుకొని ప్రజల బ్రెయిన్ వాష్ చేస్తుంటాయి. ఉదాహరణకు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ తెలంగాణవాదం, తెలంగాణ సెంటిమెంట్ రాజేస్తూనే ఉంటుంది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో భాషా వివాదం, నదీ జలాల గొడవలు, ఆంధ్రాలో కొత్తగా ‘రప్పా రప్పా సంస్కృతి’ వంటివి కనిపిస్తున్నాయి.
చైనా, పాకిస్తాన్ల నుంచి భారత్కు ప్రమాదం పొంచి ఉన్నట్లే, తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రా పాలకులు కబళించేస్తారని, దోచుకుపోతారని భయపెడుతుంటారు. అలాగే కాంగ్రెస్, బిజేపిల వలన కూడా ప్రమాదం ఉందంటారు. ప్రధాని మోడీ, అమిత్ షా, సోనియా రాహుల్ గాంధీ తదితరులందరూ తెలంగాణ రాష్ట్రంపై పగబట్టి ఉన్నారని వారందరూ మనకి శత్రువులే అని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తుంటుంది బీఆర్ఎస్ పార్టీ.
తెలంగాణను చుట్టుముట్టిన శత్రువుల నుంచి తామే కాపాడగలమని ప్రజలకు భరోసా ఇస్తుంటుంది. ప్రజలలో ఈ అభిప్రాయం బలంగా ఉంచేందుకు నదీ జలాల, ఏపీలో ప్రాజెక్టుల గురించి రాద్దాంతం చేస్తుంటుంది.
గతంలో బండి సంజయ్ తెలంగాణ బిజేపి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు, ఆ పార్టీ చాలా బలపడటంతో అప్పుడు మోడీని, బిజేపిని బూచిగా చూపేవారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కనుక దాని వలన రాష్ట్రానికి, ప్రజలకు చాలా నష్టం, కీడు జరిగిపోతున్నాయని నమ్మించే ప్రయత్నం చేస్తోంది.
ఇదో రకం బ్రెయిన్ వాష్ అనుకుంటే ఏపీలో వైసీపీ మరో రకంగా ప్రజలకు బ్రెయిన్ వాష్ అదే… రాజకీయ చైతన్యం కలిగించేందుకు ప్రయత్నిస్తోంది. ఎన్నికలలో వైసీపీ ఓడిపోయినప్పటి నుంచి జగన్ అగమ్యగోచరంగా ముందుకు సాగుతున్నారని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఆయన అప్పటి నుంచే చాలా నిర్దిష్టమైన వ్యూహంతోనే రాజకీయాలు చేస్తున్నారు.
జగన్, వైసీపీ బలప్రదర్శనలు చేస్తుండటం ఆ వ్యూహంలో భాగమే. ఈ రప్పారప్పాలు ఆ వ్యూహంలో మరో మెట్టు అని భావించవచ్చు. ‘రప్పారప్పా’ ద్వారా ప్రజలు, అధికారులు, పారిశ్రామికవేత్తలు, చివరికి టీడీపి, జనసేన శ్రేణులు కూడా భయపడేలా చేస్తున్నారు.
పిపిపి పద్దతిలో మెడికల్ కాలేజీలకు ఎవరూ టెండర్లు వేయకపోవడం గమనిస్తే వైసీపీ ఆశిస్తున్న ‘రాజకీయ చైతన్యం’ అప్పుడే మొదలైన్నట్లే అనిపిస్తుంది. ఇక మిగిలింది ప్రజలే. వారిలోనూ ఇటువంటి రాజకీయ చైతన్యం తీసుకు రాగలిగితే చాలు!




