ఒకప్పుడు జగన్ తన పార్టీ నేతల చేత నారా లోకేష్ని రకరకాలుగా అవహేళన చేయిస్తుండేవారు. మరొకరైతే వాటితో ఆత్మన్యూనతకు లోనయ్యి క్రుంగిపోయేవారు. ఆత్మహత్య చేసుకొని ఉండేవారు. అంతగా వేధించారు ఆయనని.
కానీ నారా లోకేష్ తనలో అన్ని లోపాలున్నాయని వాటితోనే గ్రహించారు. వైసీపీ నేతలు చూపిన ప్రతీ లోపాన్ని సరిదిద్దుకున్నారు.
సాధారణంగా చాలా మంది రాజకీయ నాయకులు ఇటువంటి సందర్భాలలో ఎదురుదాడి చేసి తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకుంటారు తప్ప తమ శత్రువుల విమర్శల నుంచి కూడా పాఠాలు నేర్చుకోవాలనుకోరు. అలా నేర్చుకొని లోపాలు సరిదిద్దుకోవడానికి అహం అడ్డొచ్చి దిగజారిపోతున్న జగన్, కేటీఆర్ మన కళ్ళ ముందే ఉన్నారు.
చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్లని అవహేళన చేయించి జగన్, రేవంత్ రెడ్డిని వేధించి అవమానించి కేసీఆర్, బలమైన శత్రువులను సృష్టించుకున్నారు. వారిని దెబ్బ తీయాలనుకుని వారి చేతుల్లోనే దారుణంగా దెబ్బ తిన్నారు.
రేవంత్, పవన్, లోకేష్ ముగ్గురూ ఏవిధంగా తమని తాము తీర్చిదిద్దుకున్నారు? ఏవిధంగా ఈ స్థాయికి ఎదిగగలిగారు?ఈ స్థాయికి చేరుకున్నాక వారి మాట తీరు, వ్యవహార శైలి, ఆలోచనావిధానం ఏవిధంగా ఉంది? అసలు వీరు ముగ్గురూ ఏవిధంగా ఇంకా పైపైకి ఎదగగలుగుతున్నారు… అని వారు ఈ స్థాయికి చేరుకోవడానికి దోహదపడిన జగన్, కేసీఆర్, కేటీఆర్ ఎన్నడూ ఆలోచిస్తున్నట్లు లేదు. అందుకు వారి అహం అడ్డొస్తోంది! కనుక వారి ముగ్గురి మాట తీరు, ధోరణిలో ఏ మాత్రం మార్పు రాలేదు. పైగా ఇంకా ఇంకా దిగజారిపోతూనే ఉన్నారు.
ఓ లక్ష్యం వైపు సాగడం చాలా అవసరమే. కానీ ఆ మార్గంలో ఎంత దూరం ప్రయానించినా లక్ష్యం చేరుకోలేమని తెలిసి ఉన్నప్పుడు అక్కడితో ఆ ప్రయాణం ఆపి, సరైన మార్గాన్ని తెలుసుకొని పయనించడం అవసరం. ఉదాహరణకు ఇదివరకు చంద్రబాబు నాయుడు కూడా దారి తప్పారు. కానీ అహం పక్కన పెట్టి సరైన దారిలో ముందుకు సాగి నేడు ఈ స్థాయిలో ఉన్నారు. కానీ జగన్, కేసీఆర్, కేటీఆర్లకు ఇంత చిన్న విషయం తెలుసుకోవడానికి కూడా అహం అడ్డొస్తోంది!
కానీ జగన్, కేసీఆర్, కేటీఆర్ ముగ్గురూ ఈ అహంభావమే తమకు కర్ణుడి కవచకుండలాల వంటివని గట్టిగా నమ్ముతున్నట్లున్నారు. తాము చేజేతులా సృష్టించుకున్న బలమైన ఈ నలుగురు రాజకీయ శత్రువులని తీవ్రంగా విమర్శిస్తూ, ద్వేషిస్తున్నారు. తమ ఈ అసూయా ద్వేషాలనే రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్న పోరాటాలుగా అభివర్ణిస్తూ ప్రజలను నమ్మింఛి మళ్ళీ అధికారంలోకి రావచ్చని గట్టిగా నమ్ముతున్నట్లున్నారు.
కనుక ఎవరి దారిలో వారు ముందుకు సాగుతున్నారు. లక్ష్యం పట్ల స్పష్టమైన అవగాహన ఉన్నవారు తప్పకుండా లక్ష్యం చేరుకుంటారు. లేనివారు అసూయా ద్వేషాలలో దహించుపోయి చరిత్రహీనులుగా మిగిలిపోతారు. అవునో కాదో కాలమే చెపుతుంది.






