అక్కడ కేసీఆర్‌, ఇక్కడ జగన్‌ చాలా అవసరం: పోసాని

Posani Krishna Murali

పోసాని కృష్ణ మురళికి వైసీపి ప్రభుత్వంలో సలహాదారు పదవి లభించింది కనుక ఆయన వైసీపి కళ్ళద్దాలు పెట్టుకొనే ప్రపంచాన్ని చూస్తుంటారు. జగన్‌ మనసులో మాటనే తన గొంతుతో వినిపిస్తుంటారు.

ఆ ప్రకారమే ఆయన దగ్గుబాటి పురందేశ్వరిని టార్గెట్‌ చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు ఆయన తెలంగాణ సిఎం కేసీఆర్‌ని పొగడటం మొదలుపెట్టారు. అంటే కేసీఆర్‌కు వైసీపి మద్దతు ఉందని, ఆ తర్వాత జరుగబోయే ఏపీ శాసనసభ ఎన్నికలలో ఆయన కూడా వైసీపికి మద్దతు ఇవ్వాలని ఆశిస్తున్నామని తెలియజేస్తున్నట్లే భావించవచ్చు. గత ఎన్నికలలో వైసీపిని గెలిపించేందుకు కేసీఆర్‌ సహకరించారు కనుక ఈసారి కూడా సహకరించాలని కోరుకోవడం సహజమే.

ADVERTISEMENT

అయితే నదీ జలాల పంపిణీ, ఆస్తులు, విద్యుత్ బకాయిల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్న కేసీఆరే పోసానికి చాలా మంచివాడుగా కనబడటం ఆశ్చర్యం కలిగిస్తుంది.

పోసాని మీడియాతో మాట్లాడుతూ, “కేంద్రంలో మోడీ, తెలంగాణలో కేసీఆర్‌, ఏపీలో మళ్ళీ జగన్‌ అధికారంలోకి రావాలని నేను కోరుకొంటున్నాను. దేశానికి మోడీ వంటి బలమైన నాయకుడు చాలా అవసరం. అదేవిదంగా తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్‌, ఆంద్రా ప్రజల సంక్షేమానికి జగన్‌ చాలా అవసరం,” అంటూ కేసీఆర్‌ని చాలా పొగిడారు.

తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే విషయంలో కేసీఆర్‌ నిబద్దతను ఎవరూ ప్రశ్నించలేరు. ఈ పదేళ్ళలో ఆయన తన రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకొన్నారు. అయితే తన రాష్ట్రం బాగుపడేందుకు, ఆంధ్రా నాశనం అయిపోయినా పర్వాలేదనుకోవడమే చాలా తప్పు.

తెలంగాణలో బిఆర్ఎస్ తప్ప మరే పార్టీ ఉండకూడదని కోరుకొనే కేసీఆర్‌, గత ఏపీ శాసనసభ ఎన్నికలలో వేలుపెట్టి వైసీపిని అధికారంలోకి వచ్చేలా చేశారు. ఆ తర్వాత కధ అందరికీ తెలిసిందే.

ఈ నాలుగున్నారేళ్ళలోనే ఓ పక్క ఆంధ్రప్రదేశ్‌ అన్ని రంగాలలో భ్రష్టుపట్టిపోయి చివరికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి చేరుకొంటే, తెలంగాణ అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి సాధిస్తోంది. ఏపీలో ఐ‌టి కంపెనీలు, ఏపీకి రావలసిన కంపెనీలు, పరిశ్రమలు అన్నీ హైదరాబాద్‌కు తరలిపోతుంటే, వాటిలో ఉద్యోగాల కోసం ఆంధ్రా యువత డిగ్రీలు చేతపట్టుకొని హైదరాబాద్‌ తరలిపోతోంది.

“డబుల్ రోడ్ ఉంటే అది తెలంగాణ, సింగల్ రోడ్ ఉంటే అది ఏపీ, కరెంట్ ఉంటే అది తెలంగాణ, కరెంట్ లేకపోతే అది ఏపీ…” అని కేసీఆర్‌ స్వయంగా ఆంధ్రప్రదేశ్‌ దుస్థితిని వివరించారు. ఈ దుస్థితికి తాను కూడా కారణమే అని బయటకు చెప్పలేదు కానీ అందరికీ తెలుసు.

ఏపీకి ఈ దుర్గతి పట్టించిన కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయితే తప్పకుండా జగన్‌ ముఖ్యమంత్రి అయ్యేందుకు సహకరిస్తారు. అంటే తెలంగాణ అభివృద్ధికి ఆయన ఏవిదంగా దీర్గకాలిక ప్రణాళికలు రచించి అమలుచేస్తున్నారో, అదేవిదంగా ఏపీ వినాశనానికి కూడా ప్రణాళికలు అమలుచేస్తారన్న మాట! అటువంటి వ్యక్తి పోసానికి చాలా మంచివాడుగా కనిపిస్తున్నారంటే ఏమనుకోవాలి?

ADVERTISEMENT
Latest Stories