‘అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, ఆడపిల్ల’ కాదేదీ కవితకనర్హం అన్నాడో కవి. దాదాపుగా రాజకీయ నాయకులు కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతుంటారు. తమ స్వార్ధ రాజకీయ లక్ష్యాలకు ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టరని ఇప్పటికే చాలామంది నాయకులు చాలా సందర్భాలలో నిరూపించారు. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని శవరాజకీయాలు చేసే ఘనచరిత్ర మన రాజకీయ నేతల సొంతం. ఆ క్రమంలోనే తమిళనాట జయలలిత శవపేటిక రాజకీయం జోరుగా సాగుతోంది.
జయలలిత మృతితో ఖాళీ అయిన ఆర్కేనగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల బరిలోకి దిగుతున్న పార్టీలు హోరాహోరీగా ప్రచారంలో పాల్గొంటున్నాయి. ఆ నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి రాజకీయ పార్టీలు చేస్తోన్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టి పెట్టినప్పటికీ ఆయా పార్టీలు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. డబ్బు రాజకీయాన్ని మించి అమ్మ సెంటిమెంట్ కోసం శవపేటికను రంగంలోకి దించారు నేతలు.
అమ్మ భౌతికకాయం బొమ్మ, శవపేటికతో ప్రచారం చేస్తూ… అమ్మ మరణానికి శశికళ, ఆమె కుటుంబీకులే కారణమని పరోక్షంగా పన్నీరు సెల్వం వర్గీయులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే శశికళ వర్గీయులపై అనేక అనుమానాలు నెలకొన్న నేపధ్యంలో, ఇదే అదునుగా ఓటర్లను తమ వైపుకి తిప్పుకోవడానికి పన్నీర్ వర్గం జీపుపై అమ్మ భౌతికకాయాన్ని పోలిన బొమ్మను శవపేటికలో ఉంచి ప్రచారం నిర్వహించింది. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నా, పన్నీరు వర్గం మాత్రం ఇదే రకమైన ప్రచారంతో దూసుకెళ్తోంది.



