పబ్లిక్ ప్రయివేట్ పాట్నర్ షిప్ విధానంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజ్ ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే ఈ విధానాన్ని తప్పుబడుతూ గత కొన్ని రోజులుగా వైసీపీ రాజకీయం మొదలు పెట్టింది.
కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజ్ లను ప్రయివేట్ సంస్థల పరం చేస్తుంది, పేదవాడికి వైద్యాన్ని అందని ద్రాక్షగా మార్చబోతుంది, డాక్టర్ కావాలనే విద్యార్థుల కలను కాస్టలీగా చేస్తుంది అంటూ కోటి సంతకాల సేకరణ వరకు వైసీపీ రాజకీయం విస్తరించింది.
అయితే ఈ మొత్తం కార్యక్రమంలో వైసీపీ సాధించిన విజయం కానీ తన పార్టీ తీసుకున్న కోటి సంతకాల కార్యకమాల ఫలితంగా కూటమి ప్రభుత్వాన్ని పెట్టిన ఒత్తిడి కానీ ఏమైనా ఉందా అంటే దానికి వైసీపీ నేతల దగ్గర కూడా సమాధానం ఉండకపోవచ్చు.
విపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వాన్ని ప్రతి విషయంలోనూ టార్గెట్ చెయ్యాలి అనే ఇంటెన్షన్ తప్ప ఈ విమర్శలతో వైసీపీ సాధించింది శూన్యమనే చెప్పాలి. పిపిపి విధానం పై వైసీపీ చేస్తున్న హడావుడిని, పార్టీ అధినేతగా వైస్ జగన్ చేస్తున్న రాజకీయ ప్రకటనలను పట్టించుకునే నాధుడే కరువయ్యాడు.
ఒకపక్క కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే పిపిపి అంటే ప్రయివేట్ పరం చేయడం కాదు అంటూ ప్రజలకు పూర్తి స్ఫష్టత ఇస్తున్నా వైసీపీ ఇంకా తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా మెడికల్ కాలేజీల ప్రవేటీకరణ అంటూ అదే నినాదంతో ముందుకెళుతోంది.
ఒకరకంగా చూస్తే ఈ పిపిపి పై వైసీపీ చేస్తున్న రాజకీయం పిపిపి విధానానికి ఒక ప్రమోషన్ మాదిరి సాయపడుతుందేమో బహుశా.!






