నాకూ జ్ఞానోదయం అయ్యిందోచ్: ప్రశాంత్ కిషోర్

Prashant-Kishor-YS-Jaganఅందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడి చచ్చినట్లు, దేశంలో కాంగ్రెస్‌, బిజెపిలతో సహా వాటిని వ్యతిరేకించేపార్టీలకు కూడా సేవలు అందించిన ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ కూడా ఇప్పుడు తాపీగా పశ్చాత్తాపపడుతున్నారు. ఆయన ‘జన్ సురాజ్’ పేరిట బిహార్‌లో పాదయాత్ర చేస్తున్నారు. నిన్న ఆయన చంపారన్ జిల్లాలో పాదయాత్రలో మీడియాతో మాట్లాడుతూ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

“నేను ఏపీలో జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ బిహార్‌లో నితీశ్ కుమార్‌ అధికారంలో వచ్చేందుకు వారి లక్ష్యసాధనకు ఉపయోగపడ్డాను. అదే… కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేసి ఉండి ఉంటే దేశంలో గాడ్సే సిద్దాంతలను విస్తరింపజేస్తున్న బిజెపిని నిలువరించగలిగి ఉండేవాడిని. ఈ విషయం నాకు చాలా ఆలస్యంగా అర్దమైంది. అయితే బిజెపిని గద్దె దించాలని ప్రతిపక్షాలు ఆ పార్టీని సరిగ్గా అర్దం చేసుకోలేకపోతున్నాయి. కాఫీ కప్పులో పైన కనిపించే నురగవంటిది బిజెపి కాగా దాని కింద అసలైన కాఫీ అంటే ఆర్ఎస్ఎస్ చిక్కగా నిండి ఉంటుంది. దాని మూలాలు దేశంలో చాలా లోతుగా, బలంగా అల్లుకుపోయి ఉన్నాయి. కనుక ఇది అర్దం చేసుకోకుండా బిజెపితో ఎంతగా పోరాడినా ప్రయోజనం ఉండదని నేను భావిస్తున్నాను,” అని అన్నారు.

ADVERTISEMENT

ఈ సందర్భంగా ఆయన మాట్లాడినా ఇతర అంశాలు మనకి అవసరం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవింపజేసుకోవలసిన అవసరం ఉందని చెప్పడం, జగన్ వంటివారి లక్ష్యాసాధనకు మాత్రమే పరిమితమైపోయానని చెప్పడం ఆలోచింపదగ్గవే.

కానీ కాంగ్రెస్ పార్టీలో ఆయన చెప్పిన ‘మహాత్మా గాంధీ’ ఆయన సిద్దంతాలు, నైతికత లేవని అందరికీ తెలుసు. కానీ ప్రజాస్వామ్యం, లౌకికవాదం అనే రెండు మంచి లక్షణాలు ఇంకా ఆ పార్టీలో మిగిలే ఉన్నాయి. అయినప్పటికీ దానిలో నాయకత్వలోపం, అధికారంలో ఉన్నప్పుడు అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు, దేశం దివాళా స్థితికి చేరుకోవడం, ఉగ్రదాడులను అడ్డుకోలేని నిస్సహాయత వంటి కారణాల చేత ప్రజలు కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టేసి, బిజెపి ఓ మతతత్వ పార్టీ అని తెలిసి ఉన్నప్పటికీ అధికారం కట్టబెట్టారు. అప్పుడు ప్రశాంత్ కిశోర్ స్వయంగా మోడీ అధికారంలోకి వచ్చేందుకు యధాశక్తిన తోడ్పడ్డారు కూడా. ఇప్పుడు అందుకు తాపీగా బాధపడుతున్నారు.

నైతిక విలువలను, పార్టీ సిద్దాంతాలను పట్టించుకోకుండా ప్రశాంత్ కిషోర్ ఎన్నికలను వ్యాపారంగా మార్చేసి పేరు, డబ్బు సంపాదించుకోగలిగారు. ఆ డబ్బుకి ఆశపడే ఎప్పటికైనా ముఖ్యమంత్రి కావాలనే జగన్ లక్ష్యసాధన కోసం సాయపడ్డారు. కానీ ప్రశాంత్ కిషోర్ నిర్వాకం వలన రాష్ట్ర విభజనతో ఓ సారి దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని మరోసారి దెబ్బతింది. ఎప్పటికీ కోలుకోలేని దుస్థితికి చేరుకొంది. ఈ విషయం ప్రశాంత్ కిషోర్‌కి తెలియదనుకోలేము. అయినా వచ్చే ఎన్నికలలో కూడా మళ్ళీ వైసీపీని గెలిపించడానికి ఐప్యాక్ సేవలు అందిస్తూనే ఉంది. పార్టీలు, సిద్దాంతాలు, నైతిక విలువలు లేని ప్రశాంత్ కిషోర్, బిజెపి వలన దేశం నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేయడం వంద ఎలుకలను తిన్న పిల్లి హజ్ యాత్రకు బయలుదేరినట్లే ఉంది. ఎవరినో గెలిపించే బదులు తానే అధికారంలోకి ఎందుకు రాకూడదు?అందుకు కాంగ్రెస్ పార్టీని వాడుకొంటే మంచిదని ప్రశాంత్ కిషోర్ భావిస్తున్నట్లున్నారు. ఆయన మాటల వెనుక అర్దం బహుశః ఇదే అయ్యుండవచ్చు.

ADVERTISEMENT
Latest Stories