ప్రస్తుతం గత నాలుగు రోజులుగా క్రికెట్ ప్రపంచ కళ్లన్నీ ఒక 14 ఏళ్ళ కుర్రాడి పైనే ఫోకస్ అయ్యాయి. బీహార్ లో ని మోతిపూర్ గ్రామం లో పుట్టిన ఈ కుర్రాడు ఐపీఎల్ వంటి ఒక అంతర్జీతీయ ఆటగాళ్ల సమ్మేళన లో ఇలా క్రికెట్ దిగ్గజాలనే అవాక్కు పరిచే విధంగా బ్యాట్టింగ్ చేయగలడని ఏ ఒక్కరూ కనీసం కలలో కూడా ఊహించి ఉండరు.
ఇలాంటి సంఘటనలు చూసాకే ఐపీఎల్ మన దేశ క్రికెట్ కు ఎందుకు వెన్నుముకగా నిలుస్తుందో అని అర్ధం అవుతుంది. ఇంకా కనీసం ముఖము పై గడ్డము కూడా రాని వయసులోనే క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, భారత సారధి రోహిత్ శర్మ వంటి మహా-మహుల కంటబడి, అతని టెక్నీక్ తో వారినే అబ్బురపరిచారు. ఇతను మరెవరో కాదు ‘వైభవ్ సూర్యవంశీ’.
14 ఏళ్ళ వయసులో సగటు కుర్రాడు భుజాన బ్యాగ్గు వేసుకుని బడి కి వెళ్లి, ఆ 4 గంటలకు కొట్టే గడియారం గంట చప్పుడు కోసం ఎదురుచూస్తూ ‘బడి నుండి బయటకు ఎప్పడు వదులుతారో’ అని అనుకునే వయసు లో, ఈ కుర్రాడు అంతర్జీతీయ బౌలర్లు ‘వీడెప్పుడు అవుట్ అవుతాడు రా బాబు’ అనుకునేలా చేసాడు.
పైగా వైభవ్ కొట్టిందేమి పాయింట్ల పట్టిక లో అట్టడుగున ఉన్న జట్టును కాదు, ఈ ఐపీఎల్ లోనే అత్యంత ఉత్తమమైన బౌలింగ్ ప్రదర్శన కనబరుస్తున్న గుజరాత్ టైటాన్స్ పై 35 బంతుల్లోనే సెంచరీ కొట్టి ప్రపంచానికి తన రాకను చాటిచెప్పాడు. సిరాజ్, ప్రసిద్, ఇశాంత్, రషీద్ ఖాన్, సుందర్ వంటి అంతర్జాతీయ మరియు అనుభవం అధికంగా ఉన్న ఆటగాళ్లను సైతం తన పరుగుల వేతతో భయపెట్టాడు ఈ బుడ్డోడు.
అయితే, ఈ 35 బాల్ 100 తో తాను ఎన్నో రికార్డులను చెల్లాచెదురు చేసి, ఐపీఎల్ రికార్డుల పుస్తకానికెక్కిన మాట వాస్తవమే కానీ, ఇంత చిన్న వయసు లోనే అంత ఎక్కువ హైప్ రావటం తనకు భవిష్యత్ లో అడ్డంకి గా మారగలదా? ఆ హైప్ ను సరి చేసే ఆటతీరును తాను తన కెరీర్ అంతటా ప్రదర్శించగలడా..?
ఇలాగే, చిన్న వయసులోనే సచిన్ తో పోల్చిన ‘ప్రిథ్వి షా’ ఇప్పడు ఎక్కడున్నాడనే ఊసే లేదు. మరి అలాంటి సమస్యలను వైభవ్ దాటగలడా..? నేడు ముంబై తో జరగనున్న మ్యాచ్ వైభవ్ కు అసలైన పరీక్ష కానుంది. బుమ్రా, బోల్ట్, చాహర్, పాండ్య వంటి స్టార్ బౌలర్లను ఎదుర్కోనున్నారు వైభవ్. మరి ఆ హైప్ తనకు ఇవాళ ఒత్తిడి గా మారనుందా.? లేదా అనేది చూడాలి.




