‘రాజకుమారుడు’గా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చి పదిహేడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు ప్రిన్స్ మహేష్ బాబు. 1999, జూలై 30వ తేదీన సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చిన మహేష్ కు అప్పటికే అభిమాన గణం పుష్కలంగా ఉంది. చిన్నప్పుడే చిచ్చర పిడుగులా రెచ్చిపోయిన మహేష్ అభినయానికి సినీ ప్రేక్షకులు ఎప్పుడో పడిపోయారు. అయితే చదువుల నిమిత్తం కొన్నాళ్ళ పాటు బ్రేక్ ఇచ్చిన తర్వాత ‘రాజకుమారుడు’తో ప్రిన్స్ ప్రస్థానం ప్రారంభమైంది.
అద్వితీయమైన విజయంతో ప్రారంభమైన మహేష్ నాడు చిత్ర యూనిట్ తో కలిసి రాష్ట్రమంతా పర్యటించారు. తొలి సినిమాతోనే భారీ విజయం అందుకున్న తమ అభిమాన హీరో వారసుడికి నీరాజనం పలికారు అభిమానులు. ఆనాటి అభిమాన గణమే పై ఫోటోలో ఒక భాగం. అలా మొదలుపెట్టిన మహేష్ ప్రభంజనం ప్రస్తుతానికి ఎలా మారిందో పై ఫోటోలో మరో భాగంలో స్పష్టంగా వీక్షించవచ్చు. ఇది వారసత్వంగా పుణికిపుచ్చుకున్నది కాదు. మహేష్ తన కష్టంతో తెచ్చుకున్న అభిమాన నీరాజనం.
వారసత్వం అనేది ఒక అండ మాత్రమేనని, ఎదగాలంటే స్వయంకృషి తప్పదని చాటిన హీరో ప్రిన్స్. నిత్యం వినూత్నమైన కధలను ఎంచుకుంటూ, అద్భుతమైన అభినయంతో ప్రేక్షకులను సమ్మోహితులను చేయడం వలనే నేడు ప్రిన్స్ కు ఈ స్థాయి వచ్చిందనేది కాదనలేని సత్యం. అపూర్వ విజయాలు చవిచూసిన సందర్భంలో కూడా ఏనాడూ మాట తూలింది లేదు… వివాదాలు కొని తెచ్చుకుంది లేదు. అలాగని పరాజయాల విషయంలో పక్క వారిపైకి నెట్టివేసి సేఫ్ గేమ్ ఆడింది లేదు.
‘సినిమాలు – ఫ్యామిలీ ట్రిప్’లు తప్ప వేటికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని ప్రిన్స్, తాజాగా ముగిసిన ఫ్యామిలీ వెకేషన్ తర్వాత కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. ఇలా ఎన్నో మరెన్నో సినిమాలలో తన అద్భుతమైన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుని, ఇంకా ఎత్తుకు ఎదగాలని, తెలుగు కీర్తి ప్రతిష్టతలను మరింతగా పెంచాలని ఆశిద్దాం.



