కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె అల్లుడు రాబర్ట్ వాద్రాపై ఈడీ వద్ద రెండు రెండు వేర్వేరు కేసులు నడుస్తున్నాయి.
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీకి నిన్ననే ఎదురు దెబ్బ తగిలింది. అందుకు నిరసనగా తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో కాంగ్రెస్ శ్రేణులు బీజేపి, కేంద్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ నేడు నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నాయి.
బయట కాంగ్రెస్ శ్రేణులు నిరసన ర్యాలీలు నిర్వహిస్తుంటే, పార్లమెంటు లోపల కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మద్య చాలా ఆహ్లాదకరమైన సంభాషణ జరిగింది.
ఆమె కేరళలో వయనాడ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కనుక లోక్సభలో ప్రశ్నోత్తర సమయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఉద్దేశ్యించి “సార్ సీమ్లా-చండీగడ్ మద్య తరచూ లాండ్ స్లైడ్స్ జరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి. నా నియోజకవర్గం రోడ్ల సమస్య గురించి కూడా మీతో మాట్లాడాలనుకుంటున్నాను. వీటన్నిటి గురించి మాట్లాడేందుకు 6-7 నెలలుగా మీ అపాయింట్మెంట్ కోరుతున్నాను. దయచేసి ఇప్పటికైనా అపాయింట్మెంట్ ఇస్తారా?” అని నవ్వుతూ ప్రశ్నించారు.
ఆయన కూడా అంతే హుందాగా స్పందిస్తూ, “మీరు చెప్పిన సమస్య ఈ సమస్యపై ఇప్పటికే మేము అధ్యయనం చేయించాము. హిమాలయాల పరిధిలో మొత్తం 88 చోట్ల ఇటువంటి సమస్య ఉందని గుర్తించాము. ఇటువంటి సమస్యలను పరిష్కరించడంలో చాలా అనుభవం ఉన్న స్విట్జర్లాండ్ ప్రభుత్వంతో మేము మాట్లాడుతున్నాము. ఆ దేశపు టెక్నాలజీ సహకారంతో ఈ సమస్యని శాశ్వితంగా పరిష్కరించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు మొదలుపెట్టాము.
మీకు నా ఇంటి తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి. మీరు అపాయింట్మెంట్ కోరనవసరం లేదు. నేరుగా రావచ్చు,” అని నితిన్ గడ్కరీ సమాధానం చెప్పారు.
వారిరువురూ అసలు తమ పార్టీల మద్య ఎటువంటి విభేదాలు లేవన్నట్లు హాయిగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఆమె నితిన్ గడ్కరీ ఇంటికి వెళ్ళగా ఆయన ఆమెను సాదరంగా ఆహ్వానించి, ఆమె చెప్పిందంతా ఓపికగా విని అక్కడికక్కడే వయనాడ్ రోడ్ల మరమత్తులు అవసరమైన చోట కొత్త రోడ్ల నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు.
రాజకీయాలలో ఉన్నవారు ప్రజా సమస్యల కోసం విభేదాలు పక్కన పెట్టి ఈవిధంగా పనిచేస్తే అందరూ హర్షిస్తారు. ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి. అభివృద్ధి జరుగుతుంది. కానీ రప్పా రప్పా అంటూ రాజకీయాలు చేస్తుంటే ప్రజలు అసహ్యించుకుంటారు.






