ఏపీ వైసీపీలో జగన్, షర్మిల మధ్య పదవులు, ఆస్తుల కోసం విభేదాలు ఏర్పడి శత్రువులుగా మారారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో కూడా కేసీఆర్, కేటీఆర్, కవితల మధ్య విభేదాలు ఏర్పడటంతో ఆమెను పార్టీని నుంచి బయటకు గెంటేశారు.
ఓ కుటుంబం చేతిలో సాగే ఏ ప్రాంతీయ పార్టీలలోనైనా ఇటువంటివి సర్వసాధారణమే. ఇప్పుడు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో కూడా ఇటువంటి సమస్య మెల్లగా రాజుకుంటోంది. పార్టీలో కొందరు ప్రియాంకా గాంధీని కాంగ్రెస్ ప్రధానమంత్రి అభ్యర్ధిగా ప్రకటించాలని కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు.
ఆమె భర్త రాబర్ట్ వాద్రాతో కొందరు కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ నాయకులు ఇందులో తప్పేమిటి? ఆమె అచ్చు గుద్దినట్లు దివంగత ప్రధాని ఇందిరా గాంధీలా ఉంటారు. ఆమె మాట, హావభావాలు, చివరికి రాజకీయ చురుకుదనం అన్నీ కూడా ఇందిరమ్మలాగే ఉంటాయి. కనుక ఆమెను ప్రధాని అభ్యర్ధిగా ప్రకటిస్తే, దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గు చూపుతారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగాలుగుతుందని కొందరు వాదిస్తున్నారు.
కానీ ఆమెను ప్రధాని అభ్యర్ధిగా ప్రకటిస్తే మరి రాహుల్ గాంధీ సంగతి ఏమిటి? అప్పుడు ఆయనకు నాయకత్వ లక్షణాలు లేవని స్వయంగా చాటింపు వేసుకున్నట్లు అవదా? పార్టీలో అందరూ రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకుంటుంటే, కొందరు ఈ విధంగా మాట్లాడుతూ గందరగోళం సృష్టిస్తే కాంగ్రెస్ పార్టీయే నష్టపోతుంది కదా?
అయినా రాహుల్ గాంధీ రాజకీయాలలో చురుకుగా పాల్గొంటూ, పార్లమెంటులో మోడీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నప్పుడు, ప్రియాంకా వాద్రాని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించాలనే ఆలోచన అవసరమా?
అసలు ఈ ప్రతిపాదన ఎవరు చేస్తున్నారు?ఎందుకు చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడం కోసమా లేదా పార్టీని దెబ్బ తీయడం కోసమా?” అని కాంగ్రెస్ పార్టీలోనే మరో వర్గం ప్రశ్నిస్తోంది.
ఈ తాజా చర్చపై రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా ఇంకా స్పందించలేదు. వారిరువురూ దీనిని ఖండించి ఇంతటితో దీనికి ఫుల్ స్టాప్ పెట్టవచ్చు. కానీ మౌనం వహిస్తే దీనిపై ఇంకా అనేక మంది అనేక విధాలుగా మాట్లాడుతారు. అప్పుడు నిజంగానే ప్రియాంక వాద్రా, రాహుల్ గాంధీల మద్య విభేదాలు మొదలయ్యే ప్రమాదం ఉంటుంది.
అయినా దేశంలో ప్రాంతీయ పార్టీల మద్దతు లేకుండా కాంగ్రెస్ పార్టీ తనంతట తానుగా ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రాలేనప్పుడు ఊహాజనితమైన పదవి కోసం ఈ చర్చ దేనికి? అవసరమా? దీని వలన కాంగ్రెస్ పార్టీకి నష్టమే తప్ప లాభం ఉండకపోవచ్చు.






