జనసేనలో ఏం జరుగుతుందో తెలీక ఫ్యాన్స్ అయోమయంలో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. మొదటి నుండి టీవీ ఛానెళ్లలో పార్టీని మోసిన కళ్యాణ్ దిలీప్ సుంకరను ఎందుకో ఉన్నటుండి పార్టీ దూరం పెట్టింది. ఆయనతో మాకు ఎలాంటి సంబంధం లేదు. కావున పార్టీకి సంబంధించిన చర్చలకు పిలవకండి అంటూ టీవీ వారికి చెప్పారట.
అయితే ఫ్యాన్స్ కు కళ్యాణ్ దిలీప్ సుంకరతో ప్రత్యేక అనుబంధం ఉంది. పార్టీని గట్టిగా సమర్దిస్తాడని. అలాగే జనసేన కొత్తగా నియమించిన వారు ఆ మేరకు ప్రభావం చూపించలేకపోవడంతో వారు కళ్యాణ్ దిలీప్ సుంకరను ఎందుకు పక్కన పెట్టారో తేలిక తలలు పట్టుకుంటున్నారు. కళ్యాణ్ దిలీప్ తో ఎమన్నా ఇబ్బంది ఉంటే అది పార్టీ మీడియాకు ఒక లీకైన ఇచ్చి ఉండాల్సింది.
ఇప్పుడు ఒక ప్రతిభావందుడిని వాడుకుని వదిలేశారు అనే మాట మాత్రం బయటకు వెళ్తుంది. జనసేనలోని కొందరి చెప్పుడు మాటలు విని పవన్ కళ్యాణ్ మోసపోతున్నారు అని కళ్యాణ్ దిలీప్ ఆరోపించడంతో అభిమానులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. దీనితో గతంలో ప్రజారాజ్యంలాగానే జనసేన కూడా పయనిస్తుందా అనే అనుమానం అభిమానులలోనే ఉంది.
అభిమానుల అయోమయాన్ని కత్తి మహేష్ లాంటి వాళ్ళు ఇంకాస్త ఎగదోస్తున్నారు. ఇటువంటివి సరైన సమయంలోనే నివృత్తి చెయ్యకపోతే మొదటికే ప్రమాదం వచ్చే అవకాశం మెండుగా ఉంది. కళ్యాణ్ దిలీప్ అనే వాడు పవన్ కళ్యాణ్ కి చిన్నవాడే అయ్యుండొచ్చు కానీ దీనివల్ల అభిమానులకు, పార్టీకోసం పని చేసేవాళ్ళకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి. దీనిని పవన్ కళ్యాణ్ ఎలా పరిష్కరిస్తారో చూడాలి.



