దేశంలో మొట్ట మొదటి క్వాంటం వ్యాలీ అమరావతిలో ఏర్పాటు కాబోతోంది. మూడు దశాబ్దాల క్రితం దేశంలో మొదటిసారిగా కంప్యూటర్లు, ఇంటర్నెట్, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, కోర్సులు వచ్చినప్పుడు వాటి గురించి తెలుసుకొని, ఆ అవకాశాలు అందిపుచ్చుకున్నవారు నేడు అత్యున్నత స్థాయికి ఎదిగారు.
అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ ‘క్వాంటం కంప్యూటింగ్’ గురించి ప్రతీ ఒక్కరూ అవగాహన పెంచుకోవడం అవసరమే. ముఖ్యంగా యువత రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని దీనికి సంబందించిన కోర్సులలో శిక్షణ పొందితే, నాడు సాఫ్ట్వేర్ కోర్సులు చేసి జీవితంలో రాణించిన వారిలా ఇప్పటి యువత కూడా రాణించగలరు.
ముఖ్యంగా ఏఐ వలన ఉద్యోగ భద్రత లేకుండా పోతున్న ఈ సమయంలో అమరావతిలో ‘క్వాంటం వ్యాలీ’ ఏర్పాటు కాబోతుండటం, ఆ సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణతో పాటు సుమారు లక్ష ఉద్యోగావకాశాలు ఏర్పడబోతుండటం ఏపీ యువతకు లభించిన వరంగానే భావించవచ్చు.
నిన్న జరిగిన క్వాంటం వ్యాలీ శంకుస్థాపన కార్యక్రమంలో నిపుణులు, ఐటి కంపెనీల ప్రతినిధుల మాటలు వింటే ‘క్వాంటం కంప్యూటింగ్’ వలన కలిగే ప్రయోజనాలు అర్ధమవుతాయి.
టీసీఎస్ ప్రతినిధి హారిక్ విన్ ఏమన్నారంటే, “కొత్త ఔషదాల ఆవిష్కరణ, విద్యుత్ ఉత్పాదన వంటి రంగాలలో అవకాశమున్న 50 ప్రాజెక్టులను మేము గుర్తించి పెట్టుబడులు పెడుతున్నాము,” అని చెప్పారు.
ఐబీఏం ప్రతినిధి అమిత్ సింఘ్వీ మాట్లాడుతూ, “వివిధ రంగాలలో పరిశోధనల కొరకు కొత్త అల్గరిదమ్స్, క్రిప్టోగ్రఫీ వగైరా అవసరం అవుతాయి. వాటిని క్వాంటం కంప్యూటింగ్ అందిస్తుంది.
కనుక ఈ క్వాంటం రంగంలో భారీగా నిపుణులు అవసరం ఉంటుంది. వారికి తగిన శిక్షణ ఇచ్చేందుకు ఈ రంగంలో మంచి అనుభవం ఉన్నవారు అవసరం.
ప్రపంచవ్యాప్తంగా మొత్తం 35 క్యూఐసీలున్నాయి. ఇప్పుడు అమరావతిలో 36వది ఏర్పాటు కాబోతోంది. దీని ద్వారా అపారమైన ఉద్యోగావకాశాలు లభిస్తాయి,” అని అమిత్ సింఘ్వీ అన్నారు.
భారత ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ ఏమన్నారంటే, “ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ వాడటం చేత కాకపోతే ఏవిధంగా ఇబ్బంది పడతామో, అదేవిధంగా రాబోయే రోజుల్లో క్వాంటం కంప్యూటింగ్ గురించి అవగాహన లేకపోతే ఇబ్బంది పడతాము.
ఈ క్వాంటం టెక్నాలజీని అందిపుచ్చుకోకపోతే అనేక అవకాశాలు కోల్పోతాము. ఈ క్వాంటం టెక్నాలజీతో కంప్యూటర్ల పని వేగం మరింత పెరుగుతుంది. అందుకు అవసరమైన సెన్సార్లు, కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ ఈ క్వాంటం టెక్నాలజీ అందిస్తుంది,” అని ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ చెప్పారు.
కనుక ఈ క్వాంటం కంప్యూటింగ్ రంగంలో ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని ఏపీ యువత అందిపుచ్చుకుంటే మంచిది.






