రేవంత్ సర్కార్ లో తనకు మంత్రి పదవి దక్కలేదు అనే ఆక్రోశం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని ఊరికే ఉండనివ్వడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గానే ఉంటూ రేవంత్ ప్రభుత్వానికి రెబల్ గా మారారు ఈ రెడ్డి గారు.
రెండవ విడత మంత్రి వర్గ విస్తరణలో భాగంగా మంత్రి పదవి ఆశించి భంగపడిన రాజగోపాల్ ఆనాటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతిపక్షంగా మారారు. అసెంబ్లీకి రాను అంటూ అలక పూనారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలకు వ్యతిరేకంగా గళం విప్పారు,
కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు ఎక్కుపెట్టారు, ప్రత్యర్థి బిఆర్ఎస్, బీజేపీ లకు అస్త్రాలను అందిస్తున్నారు…ఇలా గత కొంతకాలంగా రాజగోపాల్ రెడ్డి స్వపక్షంలో విపక్షంగా మారి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు.
అయితే రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి కి వ్యతిరేకంగా నోరు విప్పడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం పై అవినీతి ఆరోపణలు వేయడానికి కారణం ఆయనకు మంత్రి పదవి రాకపోవడమే. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి ఆశించినట్టే రేవంత్ ప్రభుత్వంలో ఆయనకు మంత్రి పదవి దక్కితే అసలు రాజగోపాల్ ఇలా సొంత పార్టీ నేతల మీద కత్తి కడతారా.? లేక కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు ఎక్కుపెడ్డుతారా.?
అంటే ఇక్కడ నీతికి – అవినీతికి మధ్య ఉన్న దూరం కేవలం మంత్రి పదవేనా.? తానూ ప్రభుత్వంలో మంత్రిగా ఉండుంటే నీతి పాలన గా కనిపించే రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు అవినీతి పాలనగా దర్శనమిస్తుందా.?
అలాగే ఆ మంత్రి పదవే రాజగోపాల్ కు వచ్చి ఉంటే ఇపుడు నేపాల్ తరహా చేదు ఘటనలను తెలంగాణ రాష్ట్ర పరిస్థితులతో సరిపోల్చి చూస్తారా.? లేక అసెంబ్లీ వదిలి ఇలా మీడియా ముందుకొచ్చి ప్రభుత్వం పై అవినీతి ఆరోపణలు చేస్తారా.?





