సినీ కెరీర్ పరంగా చిరంజీవికి ఎన్ని ప్రశంసలు లభిస్తాయో, రాజకీయాల పరంగా అంతకు మించిన విమర్శలు వ్యక్తమవుతుంటాయి. పొలిటికల్ కెరీర్ ఆరంభించి పదేళ్ళు గడుస్తున్నా రాజకీయాలలో ఓనమాలు ఒంటపట్టని నేత ఎవరైనా ఉన్నారు అంటే మొదట మెగాస్టార్ గారి పేరే వస్తుంది. రాజకీయ కదన రంగంలో దశాబ్ద కాలం పూర్తి కావస్తున్నా, ఇప్పటికీ ప్రెస్ మీట్ సమయాలలో తడబడడం, అవగాహన లేని వ్యాఖ్యలకు నిదర్శనం చిరంజీవిగా పొలిటికల్ వర్గాలు పేర్కొంటాయి. అలాంటి చిరంజీవి కూడా అవగాహన గురించి క్లాస్ పీకడమనేది… తను వెండితెరపై పండించే హాస్యరసమేనని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.
నేడు పార్లమెంట్ లో కేవీపీ బిల్లును తప్పించుకునేందుకు బిజెపి చేసిన విధానాన్ని తప్పుపడుతూ… ప్రత్యేక హోదా అంశాన్ని బిల్లులో పెట్టకపోవడమన్నది కేవలం అవగాహనా రాహిత్యపు వ్యాఖ్యలేనని విమర్శలు చేసారు ఈ రాజ్యసభ సభ్యుడు. నిజమే… ఏపీ ప్రజల కోణాలలో ఆలోచనలు చేస్తే, బిజెపి అనుసరిస్తోన్న విధానం విమర్శలకు తావిచ్చే అంశమే. అయితే బిజెపి ఈ రోజు ఇలా దోబూచులాడడానికి మరియు రాజకీయ కపట నాటకాలు ఆడే అవకాశం కల్పించింది ఎవరు? అన్న ప్రశ్న చిరంజీవికి తలెత్తితే, బహుశా అవగాహనా గురించి ప్రసంగించరేమో!
నాడు స్వార్ధ రాజకీయ ప్రయోజనాలను ఆశించి… కేసీఆర్ అండతో తెలంగాణాలో, జగన్ అండతో ఆంధ్రప్రదేశ్ లో జెండా పాతాలని కాంగ్రెస్ పెద్దలు, ఇప్పుడు మైక్ ల ముందు ప్రసంగాలు ఇచ్చే చిరంజీవి వంటి నేతలు… ఏ విధమైన కుటిల రాజకీయాలు చేసారో… ప్రస్తుతం బిజెపి కూడా అలాంటి విధానాలనే అవలంభిస్తోంది. కాంగ్రెస్ చూపిన దోవలోనే నడుస్తున్న బిజెపి వలన నష్టపోతోంది చిరంజీవి కాదు, మోడీ కాదు… ఏపీ ప్రజలు. ఇలాంటి తరుణంలో కూడా కాంగ్రెస్ నేతలు మళ్ళీ నీచ రాజకీయాలకు పాల్పడుతూ… ఏపీ పరిస్థితిని మరింత జటిలం చేయాలని ప్రయత్నిస్తుండడమే రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అసలు అవగాహన.



