ఏపీలో రాజకీయాలు, తెలంగాణలో మాదకద్రవ్యాలు ఎప్పటికీ ఆగేవి కావు. తాజాగా హైదరాబాద్ శివారులో జన్వాడ వద్ద ఓ ఫామ్హౌస్లో శనివారం రాత్రి రేవ్పార్టీ జరిగింది. దానిలో 22 మంది పురుషులు, 20 మంది మహిళలు పాల్గొన్నారు.
ఎప్పటిలాగే పోలీసులు వచ్చారు. లిక్కర్ బాటిల్స్, కొన్ని మాదక ద్రవ్యాలు వగైరా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు.
ఇంతవరకే అయితే దీని గురించి చెప్పుకోనవసరమే లేదు. ఈ రేవ్పార్టీ జరిగిన ఫామ్హౌస్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకలది. దానిలో ఆయనే ఈ పార్టీ ఇస్తున్నారు. పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఇక్కడి నుంచే అసలు కధ మొదలవుతుంది.
ఇటీవలే కేటీఆర్ కేంద్ర మంత్రి బండి సంజయ్కి లీగల్ నోటీస్ పంపించారు. కేటీఆర్ మాదకద్రవ్యాలు వాడుతారని, ఆయనకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సంబందం ఉందని అన్నందుకు లీగల్ నోటీస్ పంపారు. బేషరతుగా వారం రోజులలోగా క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని నోటీసులో హెచ్చరించారు.
ఓ పక్క కేటీఆర్ ఇలా పరువు నష్టం దావాలు వేస్తుంటే, ఆయన బావమరిది రాజ్ పాకల తన ఫామ్హౌస్లో రేవ్పార్టీ నిర్వహిస్తూ దొరికిపోవడంతో ‘ఇప్పుడేమంటావ్ కేటీఆర్?’ అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇప్పుడూ అడ్డంగా బుకాయిస్తాడేమో?
కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రేవ్పార్టీ జరిగిన్నట్లు, దానిలో డ్రగ్స్ వాడిన్నట్లు పోలీసులకు పక్కా సాక్ష్యాధారాలు లభించాయి కనుక రేవ్పార్టీలో పాల్గొన్న రాజ్ పాకాల తదితరులపై కేసు నమోదు చేసి చర్యలు తీసువాలి. కానీ కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మద్య రహస్య అవగాహన ఎప్పుడూ ఉంటుంది. కనుక ఎప్పటిలాగే హడావుడి చేసి ఈ కేసుని అటకెక్కించేస్తారేమో? అని బండి సంజయ్ అన్నారు.
బావమరిది రేవ్పార్టీలో అడ్డంగా పోలీసులకు దొరికిపోవడంతో కేటీఆర్ వేస్తున్న పరువు నష్టం దావా కేసులు చాలా హాస్యస్పదంగా అనిపిస్తున్నాయిప్పుడు. ఇప్పుడు ప్రత్యర్ధులే ఆయనని ఈవిదంగా ప్రశ్నిస్తుండటం, కాంగ్రెస్-బిఆర్ఎస్ రహస్య అవగాహన ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో కేటీఆర్ రాజకీయంగా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవలసి వస్తోంది.




