ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీల మద్య బంధం ఉందని పలుమార్లు నిరూపించుకున్నాయి. రాయలసీమ ఎత్తిపోతల పధకం పేరుతో రెండు పార్టీలు చేస్తున్న రాజకీయాలు గమనిస్తే వాటి మద్య బంధం ఇంకా బలపడిందని స్పష్టమవుతోంది.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కొత్త పల్లవి అందించారు. అది పట్టుకొని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి నదీ జలాల విషయంలో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కయ్యి తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు.
దానిపై సిఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ, తాను సిఎం చంద్రబాబు నాయుడుతో స్వయంగా మాట్లాడానని, ఆయన తనపై గౌరవంతో రాయలసీమ ఎత్తిపోతల పధకం ఆపేశారని శాసనసభలో చెప్పారు.
రేవంత్ రెడ్డి చెప్పిన ఆ మాటలు పట్టుకొని ఇక్కడ ఏపీలో వైసీపీ రాజకీయాలు మొదలుపెట్టేసింది. ఆ పార్టీ నాయకులు నేడు రాయలసీమ ప్రాజెక్టుని సందర్శించి ఫోటోలు దిగి, సిఎం చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు.
“రాయలసీమని సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశ్యంతో జగన్ 2020లో రూ.3,207 కోట్లతో ఈ ప్రాజెక్టుకి శ్రీకారం చుడితే, చంద్రబాబు నాయుడు తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకొని ఈ ప్రాజెక్టు నిలిపివేశారు. ఈ విషయం తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా మొన్న శాసనసభలో బయటపెట్టారు. చంద్రబాబు నాయుడు రాయలసీమకి, సీమ ప్రజలకు తీరని ద్రోహం చేశారు,” అని వైసీపీ నేతలు విమర్శించారు.
అయితే రేవంత్ రెడ్డి చెప్పిన మాటని క్యాచ్ చేసిన వైసీపీ నేతలు, ఆ తర్వాత హరీష్ రావు చెప్పిన మాటలని మాత్రం తమ సౌలభ్యం కొరకు ఈ చెవితో విని ఆ చెవితో వదిలేశారు.
హరీష్ రావు ఏమన్నారంటే, “మేము 2020లోనే ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి ఆ ప్రాజెక్టుని ఆపించేశాము. ఇదిగో సాక్ష్యం అంటూ నాడు తమ ప్రభుత్వం ఏపీలో జగన్ ప్రభుత్వానికి వ్రాసిన ఓ లేఖని చూపించారు.
రాయలసీమ ప్రాజెక్టుని నేనే ఆపించేశానంటూ సభలో అబద్దాలు చెప్పిన సిఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు?” అని హరీష్ రావు ఎద్దేవా చేశారు.
అంటే జగన్ హయంలో రాయలసీమ ప్రాజెక్టుకి బ్రేకులు పడ్డాయని స్పష్టమవుతోంది.
ఇందుకు మూడు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. 1. జగన్ సంక్షేమ పధకాల అమలుపై చూపిన శ్రద్ధ మరి దేనిపైనా చూపలేదు. 2. వాటికే అప్పులు చేస్తున్నప్పుడు ఈ ప్రాజెక్టు కోసం జగన్ డబ్బు ఖర్చు చేస్తారనుకోవడం అవివేకమే. 3. జగన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు కేసీఆర్ సాయపడ్డారు. కనుక అందుకు కృతజ్ఞతగా అమరావతి, పోలవరం పనులు నిలిపివేసినట్లే ఈ ప్రాజెక్టు పనులు నిలిపివేయించి ఉండవచ్చు.
కానీ తాము ‘శ్రీకారం చుట్టిన’ ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు నిలిపివేశారంటూ వైసీపీ నేతలు రాజకీయాలు మొదలుపెట్టేశారు.
అసలు వారికి ఈ లీడ్ ఇచ్చింది ఎవరు?రేవంత్ రెడ్డా? కాదు కేసీఆర్!
ఆయనకి ఓ దురలవాటుంది. ఎప్పుడూ ఒకే దెబ్బకు రెండు మూడు పిట్టలు కొట్టాలనుకుంటారు. కనుక రెండేళ్ళుగా ఫామ్హౌసులో కూర్చొని ఈ కొత్త కుట్రకి రూపకల్పన చేసినట్లు అర్ధమవుతోంది.
1. ఏపీ, తెలంగాణల మద్య నీళ్ళ రాజకీయాల పేరుతో గొడవలు మొదలైతేనే బీఆర్ఎస్ పార్టీ లాభపడగలదు. ఇరువురు ముఖ్యమంత్రులు తమ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారనే దుష్ప్రచారం చేసుకునేందుకు వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలకు మంచి అవకాశం లభిస్తుంది.
2. ముఖ్యంగా తెలంగాణలో సెంటిమెంట్ బలంగా ఉంటుంది కనుక సిఎం రేవంత్ రెడ్డిని నదీజలాల పేరుతో తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబెట్టడం బీఆర్ఎస్ పార్టీకి సులువు. అవసరం కూడా.
3. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మద్య సఖ్యత చెడి ఘర్షణ పడతారు. అప్పుడు రేవంత్ రెడ్డిని దెబ్బ తీయడం బీఆర్ఎస్ పార్టీకి సులువవుతుంది.
4. ఏపీలో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతుండటంతో సిఎం చంద్రబాబు నాయుడు గ్రాఫ్ వేగంగా పెరుగుతుంటే, రప్పా రప్పా రాజకీయాలతో జగన్ గ్రాఫ్ అంతే వేగంగా పడిపోతోంది. కనుక చంద్రబాబు నాయుడుపై బురద జల్లుతూ, జగన్ని జాకీలు పెట్టి లేపాల్సిన బాధ్యత, అవసరం తమకి ఉన్నాయని కేసీఆర్ భావించి ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి ఉండవచ్చు.
కనుక కేసీఆర్ పక్కా ప్లాన్ చేసి ఈ అంశంపై చర్చ మొదలయ్యేలా చేసి ఈ ఉచ్చులోకి మొదట రేవంత్ రెడ్డిని లాగారు. ఆయన దానిలో చిక్కుకొని కేసీఆర్ ఊహించినట్లే మాట్లాడారు. కనుక కేసీఆర్ ప్లాన్ చేస్తే అక్కడ బీఆర్ఎస్, ఇక్కడ వైసీపీ దానిని అమలుచేస్తున్నాయి.






