అమరావతిలో వేడుకలు: రాజముద్రకేనా.?

Republic Day celebrations held in Amaravati

నేడు దేశవ్యాప్తంగా 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో, తెలంగాణ రాజధాని హైద్రాబాద్ లో సైతం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా వేడుకలను నిర్వహించాయి.

అయితే రాష్ట్ర విభజన తరువాత ఏపీలో టీడీపీ, వైసీపీ రెండు ప్రభుత్వాలు కొలువు తీరినప్పటికీ, రాజధానిగా అమరావతిని ప్రకటించిన ఇన్నేళ్ల తరువాత తొలిసారి అమరావతిలో ఈ గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి.

ADVERTISEMENT

అమరావతిలోని హైకోర్టు సమీపంలో కూటమి ప్రభుత్వం ఈ వేడుకల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. గవర్నర్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ, అటు పిదప పెరేడ్ లో 11 దళాల గౌరవ వందనం, ఆ పై గవర్నర్ స్పీచ్…ఇలా మొదలైన గణతంత్ర వేడుకలు రాజధాని పై రాష్ట్ర ప్రజలకు ఒక భరోసాను అందించడంతో పాటుగా వైసీపీ రప్ప రప్ప రాజకీయాలతో అధైర్య పడుతున్న పారిశ్రామికవేత్తలకు ఒక నమ్మకాన్ని అందించాయనే చెప్పాలి.

ఈ వేడుకలతో కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి పై వైసీపీ మొదలుపెట్టిన మూడుముక్కలాటకు ముగింపు పలుకుతూ రాష్ట్ర రాజధాని గా అమరావతి పై రాజముద్ర వేసింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంలో కూడా ఇదే అంశాన్ని ఉటంకించారు.

తొలిసారిగా రాష్ట్ర రాజధానిలో జాతీయ జెండా ఎగురవేయడం జరిగింది, గత ప్రభుత్వ నిర్ణయాలతో రాజధాని నిర్మాణం ఆగిపోయింది, తద్వారా ఆర్థిక విశ్వాసం దెబ్బతింది, కానీ ఇప్పుడు లక్ష్యాలను అందుకునేలా ఫలితాలు చాల స్పష్టంగా కనిపిస్తున్నాయి, అమరావతి తిరిగి నిర్మాణాలతో కళకళలాడుతుంది అంటూ గవర్నర్ చేసిన ప్రసంగం రాజధాని పై వైసీపీ సాగిస్తున్న విష ప్రచారానికి విరుగుడు వేసింది.

కూటమి రాకతో అరణ్యవాసంగా మారిన అమరావతి తిరిగి అభివృద్ధి బాటపట్టింది. నాటి ప్రభుత్వం మిగిల్చిన చేదు జ్ఞాపకాల స్థానంలో నేడు కూటమి ప్రభుత్వం తీపి కబుర్లను అందిస్తుంది. అమరావతిలో క్వాంటం వ్యాలీ నిర్మాణం, బిట్స్ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల పెట్టుబడులు, బాహుబలి బ్రిడ్జ్ వంటి కనెక్టివిటీ రహదారులు, CRDA కార్యాలయం ఆవిర్భావం…వంటి పనులతో అమరావతి వేగం పెంచుకుంది.

ఇక అమరావతిలో సెకండ్ ఫేస్ భూసేకరణ వంటి ప్రభుత్వ నిర్ణయానికి సైతం రాజధాని ప్రాంత రైతుల నుంచి సానుకూల స్పందన రావడం, వైసీపీ నుంచి రక్షణ కొరకు రాజధానిగా అమరావతికి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించే దిశగా అడుగులు వేయడం, ఇటువంటి వేడుకల నిర్వహణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర రాజధానిగా అమరావతి కి విస్తృత ప్రచారాన్ని కల్పించడం అన్ని కలగలిపి అమరావతి బలోపేతానికి బాటలు వేస్తున్నాయి.

ఈ వేడుకలలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తో పాటుగా రాజధానికి భూములిచ్చిన రైతులు వారి కుటుంబాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంతులు లోకేష్, అచ్చెన్ననాయుడు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, కూటమి మంత్రులు, ఎమ్మెల్యే లు పాల్గొనడంతో రాష్ట్ర రాజధానిగా అమరావతి కి దేశ వ్యాప్తంగా దక్కాల్సిన గుర్తింపు, గౌరవం రెండు దక్కే అవకాశం ఉంటుంది.

అలాగే ఈ వేడుకలకు ముఖ్య అతిథిధులుగా రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన అమరావతి రైతులు, వారి కుటుంబాలు కూడా పాల్గొనడంతో వారి త్యాగాలకు ప్రభుత్వం నుండి సరైన గుర్తింపు దక్కినట్టయ్యింది. ఒకరకంగా ఈ వేడుక నిర్వహణతో సీఎం చంద్రబాబు రాజధానిగా అమరావతి రాజముద్రవేశారనే చెప్పాలి.

ADVERTISEMENT
Latest Stories