ఏపీలో కాపులకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ చేస్తూ… మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన వరుస దీక్షలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడ్డ టీడీపీ సర్కారు… కాపులకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై అధ్యయనం కోసం జస్టిస్ మంజునాథ అధ్యక్షతన బీసీ కమిషన్ ను ఏర్పాటు చేసి ఒక సంవత్సరపు నిర్దిష్ట కాలపరిమితిని విధించింది.
ఇప్పటికే పని ప్రారంభించిన సదరు కమిషన్ ను కలిసేందుకు విజయవాడ వెళ్లిన అఖిల భారత కాపు సంఘం నేతలు… కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయను వెంటబెట్టుకుని జస్టిస్ మంజునాథతో భేటీ అయ్యారు. తమ సామాజిక వర్గపు రిజర్వేషన్ల అంశాన్ని త్వరగా తేల్చాలని వారు ఓ వినతి పత్రం సమర్పించారు. అయితే ఈ సందర్భంగా జస్టిస్ మంజునాథ చేసిన కామెంట్స్ తో కాపు నేతలు అవాక్కయ్యారని సమాచారం.
“కాపుల్లో ఐదు శాతమే ఉన్నతంగా ఉన్నారని మీరు చెబుతున్నారు. కానీ కొన్ని సంఘాలు కాపుల్లో 95 శాతం అభివృద్ధి చెందారని, ప్రముఖ కాంట్రాక్టర్లు, బిల్డర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీల్లో కాపులే అధికంగా ఉన్నారని కూడా ఆ సంఘాలు చెబుతున్నాయి” అని జస్టిస్ మంజునాథ చేసిన వ్యాఖ్యలతో కాపు నేతలు షాక్ తిన్నారట. రాష్ట్రంలో ఒక్క సామాజిక వర్గం మినహా మిగిలిన అన్ని వర్గాలూ రిజర్వేషన్లను కోరుతున్నాయని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది.



