ఒక ప్రభుత్వ హయంలో అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు జరిగితే తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ‘రాజకీయ కక్ష సాధింపు’ ట్యాగ్ తగిలించేసి ఎదురుదాడి చేయడం పరిపాటిగా మారిపోయింది.
ఒకవేళ కేసులు నమోదు చేసినా కళ్ళెదుటే తిరుగుతున్న నిందితులను రాజకీయ కారణాల వలన అరెస్టు చేయలేని నిసహాయత!
దీనికి చక్కటి ఉదాహరణ తెలంగాణలో కాళేశ్వరం, ఎఫ్-1 రేసింగ్, ఫోన్ ట్యాపింగ్ కేసులే అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు మధ్యాహ్నం సిట్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చిన తర్వాత బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, “ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మొట్ట మొదటి బాధితుడిని నేనే.
కేసీఆర్ నాది, నా కుటుంబ సభ్యులవి, చివరికి మా ఇంట్లో పనివాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయించారు. ఈ కేసుకు సంబందించి నా దగ్గర ఉన్న రహస్య సమాచారం సిట్ అధికారులకు ఇచ్చాను.
కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేసీఆర్ని అరెస్ట్ చేసే ధైర్యం లేదు. అందుకే విచారణ, కమీషన్ల పేరుతో అప్పుడే 20 నెలలు దొర్లించేసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నేతలు పైకి కత్తులు దూసుకున్తునట్లు నటిస్తున్నప్పటికీ, రాష్ట్రంలో బీజేపిని అడ్డుకునేందుకు రెండు పార్టీలు తెరవెనుక పరస్పరం సహకరించుకుంటాయి.
ఒకవేళ కాదంటే తక్షణమే కేసీఆర్ని అరెస్ట్ చేయాలి. రేవంత్ రెడ్డికి ధైర్యం లేకపోతే సీబీఐకి ఈ కేసుని అప్పగిస్తే కేసీఆర్ సంగతి మేము చూసుకుంటాము,” అని బండి సంజయ్ అన్నారు.
కానీ రేవంత్ రెడ్డికి ధైర్యం లేకనే కేసీఆర్ని అరెస్ట్ చేయడం లేదా? అంటే కాదనే చెప్పవచ్చు. ఇదివరకు చంద్రబాబు నాయుడుని జగన్ హడావుడిగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టించారు.
తద్వారా టీడీపిని దెబ్బ కొట్టి తుడిచి పెట్టేయవచ్చనుకుంటే, చంద్రబాబు నాయుడుపై ప్రజలలో సానుభూతి ఏర్పడటంతో ఎన్నికలలో వైసీపీయే దెబ్బైయిపోయింది.
కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తదితర బీఆర్ఎస్ పార్టీ నేతలను అరెస్ట్ చేసేందుకు వెనుకాడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
కానీ ఇటువంటి రాజకీయ కారణాలతో ప్రభుత్వాలు నిసహయత ప్రదర్శిస్తుంటే ప్రజలకు పాలకుల పట్ల, వ్యవస్థల పట్ల నమ్మకం కోల్పోరా?
ఈ చట్టాలు, న్యాయస్థానాలకు, శిక్షలకు రాజకీయ నాయకులు అతీతుతులు…. అవన్నీ మావంటి వారిపై ప్రయోగించడానికి మాత్రమే అని సామాన్య ప్రజలు భావిస్తున్నారు.
వివేక కుమార్తె సునీతా రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ, “నా తండ్రి హత్య కేసులో న్యాయం కోసం దాదాపు 5 ఏళ్ళు పైగా నేను పోరాడుతున్నాను. కనుక నిందితులు నన్ను చూసి భయపడాలి. కానీ వారిని చూసి నేనే భయపడాల్సిన పరిస్థితి. ఎప్పుడు ఏం చేస్తారో అని ప్రాణ భయంతో బతుకుతున్నా,” అని అన్నారు.
అంటే డబ్బు, పలుకుబడి, రాజకీయ బలం ఉంటే ఈ కేసులు, కోర్టులు ఏమీ చేయలేవని జగన్, కేసీఆర్ వంటివారు నిరూపించి చూపుతూన్నారను కోవచ్చు.






